Tirumala:ఏటేటా తిరుమలకి వస్తున్న భక్తుల సంఖ్యపెరుగుతూ వస్తోంది. ప్రపంచ నలుమూల నుంచి శ్రీవారి భక్తులు తిరుమలకి వస్తున్నారు. పెరుగుతున్న భక్తుల సంఖ్యకి తగ్గట్టు తిరుమల తిరుపతి దేవస్థానం
ఎప్పటికప్పుడు ఎన్నో మార్పులు చేస్తోంది. రద్దీని తట్టుకునేందుకు ఆధునిక టెక్నాలిజీ వినియోగిస్తోంది. అందులో భాగంగా తిరుమలలో అక్రమాల నివారణకు టీటీడీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువస్తోంది. . శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది.
మార్చి ఒకటో తేదీ నుంచి ఈ టెక్నాలజీని తీసుకురానుంది. సర్వదర్శనం కాంప్లెక్స్ లో ఒకే వ్యక్తి అధిక లడ్డు టోకెన్లు పొందకుండా, గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ఈ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకురానున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.ఈ ప్రయోగం విజయవంతమైంది ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని మిగిలిన సేవలకు కూడా వర్తింప చేయాలని టీటీడీ భావిస్తోంది. పారదర్శంగా భక్తులకి సేవలకు అందించేందుకు కృతనిశ్చయంతో ఉంది. దళారీ వ్యవస్థకు కూడా చెక్ పెట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు.
మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులోకి పెట్టింది. మార్చి నుంచి వెయ్యి శ్రీవాణి టిక్కెట్లలో, 500 ఆన్లైన్లో, 400 తిరుమలలోని గోకులం కార్యాలయంలో, 100 తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. టికెట్లు కావలసిన భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టికెట్లు జారీ చేస్తారు