TTD: శ్రీవారి లడ్డూ ప్రసాదం. భక్తులకు మహా ప్రసాదం. పరమ పవిత్రంగా భావిస్తారు. లడ్డుల కోసం ఆరాటపడుతుంటారు. ఎన్ని లడ్డూలు కొన్నా తనివి తీరదు. మనసు తృప్తి పడదు. తిరుమల లడ్డూలకు అంతటి విశిష్టత. అంతకుమించి డిమాండ్.
లడ్డూలు కొన్న భక్తులు వాటిని తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్ ఉంది. నో క్యారీబ్యాగ్స్. జ్యూట్తో, క్లాత్తో చేసిన బ్యాగుల్లో లడ్డులు తీసుకెళుతున్నారు. ఇకపై వారికి మరో ఆప్షన్ కూడా రాబోతోంది. అదే తాటాకు బుట్ట.
అవును, శ్రీవారి లడ్డూలను తాటాకు బుట్టల్లో అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. పలు రకాల సైజుల్లో ఉన్న బుట్టలను ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. లడ్డు ప్రసాదాలను తీసుకెళ్లే భక్తులకు తాటాకు బుట్టలు ఎంతమేర ఉపయోగకరంగా ఉంటాయనే దానిపై టీటీడీ అధ్యయనం చేయనుంది.
ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా తాటాకు బుట్టలతో ప్రకృతి పరిరక్షణ చేపట్టొచ్చని టీటీడీ భావన. అలాగే,
సంప్రదాయ వృత్తులను ప్రోత్సహించినట్టూ ఉంటుంది. టీటీడీ తాజా నిర్ణయంతో తాటి చెట్లను పెంచే వారికి ఆదాయం, తాటాకు బుట్టలను తయారు చేసే వారికి చేయూత అందుతుంంది.
ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త విజయరామ్ సహకారంతో తాటాకు బుట్టలను తిరుమల లడ్డూ విక్రయ కేంద్రంలో భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.