Preethi: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి నాలుగు రోజులుగా ప్రాణాలతో పోరాడుతోంది. నిమ్స్లో ఆమెకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం నిరంతరం ప్రీతి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో విద్యార్థినిపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్పై సస్పెన్షన్ వేటు పడింది.
కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఎక్మో సపోర్ట్తో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. ఆమెను కాపాడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నామన్నారు వైద్యులు. ఈ మేరకు డీఎంహెచ్వోకు వైద్యుల బృందం నివేదికను అందజేసింది. న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, కార్డియాజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకుందని, దీని ప్రభావం శరీరంలోని భాగాలపై విపరీతంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముఖ్యంగా బ్రెయిన్ పై మత్తు ఇంజెక్షన్ ప్రభావం ఎక్కువగా పడిందన్నారు. ఇక ప్రీతి ఆత్మహత్యాయత్నంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది.
ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్పై సస్పెన్షన్ వేటు పడింది. మెడికల్ లీగల్ కేసుగా పరిగణిస్తూ చర్యలు తీసుకున్నట్లు MGM సూపరింటెండెంట్ వెల్లడించారు. వేధింపులు రుజువై శిక్షపడితే సైఫ్ను కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే డీఎంఈకి వైద్యుల బృందం విచారణ నివేదికను పంపించామని పేర్కొంది. విచారణ నివేదికను ఎంసీఐకి సైతం పంపిస్తామని MGM సూపరింటెండెంట్ తెలిపారు. కాగా ఈ కేసులో నిందితుడు సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సైఫ్ను ఖమ్మం జైలుకు తరలించారు.
మరోవైపు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి హరీష్రావు ఆరా తీశారు. నిమ్స్కు వెళ్లిన ఆయన.. వైద్యం అందుతున్న తీరును పరిశీలించారు. అత్యుత్తమ వైద్యం అందించాలని… అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులను మంత్రి హరీష్ ఆదేశించారు. అలాగే ప్రీతి తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.