LIC: అదానీ గ్రూప్ షేర్ల పతనం.. ఇప్పుడు ఎల్ఐసీ ని కూడా నిండా ముంచేస్తోంది. ఒకప్పుడు భారీ లాభాల్లో ఉన్నాయని భావించిన ఎల్ఐసీకి.. ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. హిండెన్ రీసెర్చ్ దెబ్బకు.. ఎల్ఐసీ పెట్టుబడులపై లాభాలు కాస్తా క్రమంగా ఆవిరైపోయాయి. పైగా ఎల్ఐసీ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది. అదానీ గ్రూప్ షేర్ విలువ మరింత పతనమైనా.. పెట్టుబడులు ఉపసంహరించినా ఎల్ఐసీకే నష్టం.
అదానీ గ్రూప్ లోని పలు సంస్థల్లో ఎల్ఐసీ భారీగా పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, ఏసీసీ, అంబుజా సిమెంట్ షేర్లలో ఎల్ఐసీ రూ.30,127 కోట్లు పెట్టుబడి పెట్టింది. అదానీ గ్రూప్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నప్పుడు ఎల్ఐసీ పెట్టుబడుల విలువ కూడా భారీగానే పెరిగింది. 2022 డిసెంబర్లో ఎల్ఐసీ… పెట్టుబడులపై 50 వేల కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. ఇక జనవరి 24న హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్టు వచ్చిన తర్వాత అంతా తలకిందులైంది. క్రమంగా షేర్ల పతనంతో ఎల్ఐసీ లాభాల విలువ కూడా తగ్గిపోయింది.
ఇంత జరిగినా ఎల్ఐసీ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో తమ పెట్టుబడులు… మొత్తం పెట్టుబడుల్లో కేవలం ఒక శాతం కూడా లేవని ప్రకటించింది. పైగా జనవరి 30న అదానీ గ్రూప్ లో పెట్టుబడులపై 26 వేల కోట్ల రూపాయల లాభంలో ఉన్నట్లు వెల్లడించింది. కానీ ఇప్పుడు ఎల్ఐసీ పెట్టుబడులు విలువ రూ.33,686 కోట్లకు చేరింది. అంటే కేవలం 3 వేల కోట్ల రూపాయల లాభంలో మాత్రమే ఎల్ఐసీ పెట్టుబడులు ఉన్నాయని అర్థమవుతోంది.
అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ మరింత పతనమైతే ఎల్ఐసీ పెట్టుబడుల విలువ మరింత క్షీణించే అవకాశం ఉంది. అలాగే ఈ తరుణంలో ఎల్ఐసీ తమ షేర్లను విక్రయించాలని భావించినా.. అదానీ గ్రూప్ పై ఆ ప్రభావం పడుతుంది. అదానీ గ్రూప్ లోని షేర్లు మరింత పతనమవుతాయి. ఇది అదానీ గ్రూప్ తో పాటు.. ఎల్ఐసీకి కూడా మరింత నష్టదాయకమే. దీంతో.. అదానీ గ్రూప్ లో పెట్టుబడులు.. పులిపై స్వారీలాగా మారాయి ఎల్ ఐసీకి. కొనసాగలేదు.. వైదొలగలేదు. ఎలా చూసినా .. నిలువునా కుప్పకూలే పరిస్థితి. దీంతో.. ఏం చేయాలో అర్థంకాక.. బీమా కంపెనీ దిగాలు పడుతున్నది.