Congress: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఇప్పుడు పార్టీకి హోల్ అండ్ సోల్ ఆయనే. సుప్రీం లీడర్. ఆయన నోటినుంచి ఓ మాట వచ్చిందంటే అదే ఫైనల్. రాయ్పుర్లో జరుగుతున్న 85వ పార్టీ ప్లీనరీలో మల్లికార్జున ఖర్గే పొత్తులపై సంచలన ప్రకటన చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి. ఇంతకీ ఖర్గే ఏమన్నారంటే…
పొత్తులతోనే 2024 ఎన్నికలకు వెళ్లనున్నట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటించారు. బీజేపీని ఓడించేందుకు భావసారుప్యం కలిగిన పార్టీలతో కలవనున్నట్టు చెప్పారు. 2004 నుంచి 2014 వరకు భావసారుప్యం కలిగిన పార్టీతో కలిసి దేశానికి ఏవిధంగా సేవ చేశామో.. అదే తరహాలో మరోసారి అలాంటి పార్టీలతో కలిసి ప్రజావ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపుతామని ఖర్గే అన్నారు. ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరుసగా పదేళ్ల పాటు దేశాన్ని పాలించింది. ఆనాటి యూపీఏ కూటమిలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అందులో టీఆర్ఎస్ కూడా ఉంది. 2004లో ఎంపీగా గెలిచిన కేసీఆర్.. యూపీఏలో చేరి కేంద్రమంత్రి కూడా అయ్యారు. 2004 నుంచి 2006 వరకు.. రెండేళ్ల పాటు సెంట్రల్ లేబర్ మినిస్టర్గా చేశారు.
ఖర్గే మాటలను బట్టి చూస్తే.. బీజేపీని ఓడించడానికి అలాంటి పార్టీలతో మరోసారి పొత్తుపెట్టుకునే దిశగా కాంగ్రెస్ ఆలోచన చేస్తుందని అనిపిస్తోంది. బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్లు మళ్లీ కలుస్తాయా? అనే చర్చ మొదలైంది. ఇటీవల ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిసైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తెలంగాణలో హంగ్ వస్తుందని.. కేసీఆర్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోక తప్పదని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం చెలరేగగా.. కోమటిరెడ్డి వెనక్కితగ్గారు. ఇప్పుడు ఖర్గే నేరుగా బీఆర్ఎస్ పార్టీ పేరు తీయకుండా.. 2004 నుంచి 2014 వరకు తమతో ఉన్న పార్టీల ప్రస్తావన తీసుకురావడంతో మరోసారి గులాబీ పార్టీ టాపిక్ తెరమీదకు వస్తోంది.
అయితే, బీఆర్ఎస్తో భవిష్యత్తులో ఎలాంటి పొత్తు ఉండదంటూ వరంగల్ సభలో రాహుల్గాంధీ తేల్చి చెప్పారు. కాంగ్రెస్లో రాహుల్ మాటే అల్టిమేట్. ప్రస్తుతం ఖర్గే చేసిన వ్యాఖ్యలు జనరల్గా చేసినవేనని.. ఆ భావసారూప్య పార్టీల్లో బీఆర్ఎస్ ఉండే ప్రసక్తే లేదని కాంగ్రెస్ వాదులు అంటున్నారు. కేసీఆర్ను నమ్మే పొరబాటు మరోసారి చేయదని చెబుతున్నారు. తెలంగాణలో హస్తం పార్టీకి ప్రధాన శత్రువు బీఆర్ఎస్సే అంటోంది కాంగ్రెస్.