Preethi: కొన్ని విషయాలు ఎందుకు వివాదాస్పదం అవుతాయో అర్థం కావు. ఎవరూ ఊహించని విధంగా కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. దానిపై క్లారిటీ ఇచ్చేలోగా.. జరగాల్సిన నష్టం జరిగిపోతుంటుంది. నిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రీతిని చూసేందుకు వెళ్లిన గవర్నర్ తమిళిసై విషయంలో అలానే జరిగింది.
గవర్నర్ తమిళిసై బాధ్యతగా స్పందించారు. ప్రీతి విషయంలో చలించిపోయారు. నిమ్స్కు వెళ్లి మరీ వైద్య సేవలపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకూ సూచించారు. ప్రీతి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇంత వరకూ బాగుంది. కట్ చేస్తే.. కొన్నిగంటల్లోనే గవర్నర్ విషయంలో సోషల్ మీడియాలో కాంట్రవర్సీ స్టార్ట్ అయిపోయింది.
వివాదం ఏంటంటే.. నిమ్స్కు గవర్నర్ వచ్చిన వాహనంలో పూలదండ ఉండటం. ఆ విషయం ఎలానో బయటికి వచ్చింది. అంటే? ప్రీతిని చూట్టానికి వస్తూ పూలదండ ఎందుకు తెచ్చినట్టు? మా అక్క చచ్చిపోయిందని.. గవర్నర్ పూలదండ తీసుకొచ్చారా? అంటూ ప్రీతి సోదరి దీప్తి మీడియా ముందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె మాటలు వైరల్ అయ్యాయి.
కాంట్రవర్సీ రాజ్భవన్ వరకూ చేరింది. జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. ఓ ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ‘‘గవర్నర్ వేరే ప్రదేశాల నుంచి రాజ్భవన్కు తిరిగి వచ్చేటప్పుడు ఖైరతాబాద్లోని హనుమంతుడి గుడికి వెళ్లి రావడం చాలా రోజుల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ విషయాన్ని దుష్ప్రచారం చేస్తూ విపరీత అర్థాలు తీయడం సరి కాదు. ప్రీతి త్వరగా కోలుకోవాలని హనుమంతుడి గుడిలో గవర్నర్ ప్రార్థించారు. గవర్నర్ నిమ్స్ పర్యటనను సరైన దృష్టితో అర్థం చేసుకోవాలి.’’ అని ఆ ప్రకటనలో వెల్లడించింది రాజ్భవన్.