Sajjala: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వైఎస్ అవినాశ్రెడ్డి చుట్టూనే తిరుగుతోంది. అసలు కుట్రదారు ఆయనే అనేలా కౌంటర్ రిపోర్టులో రాశారు. ఈ పరిణామం వైసీపీకి ఇబ్బందిగా మారింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రంగంలోకి దిగి.. చంద్రబాబుపై విమర్శల దాడి స్టార్ట్ చేశారు.
వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డికి సంబంధం లేదన్నారు సజ్జల. బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డికి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలున్నాయని అన్నారు. వివేకా హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని.. కొందరిని టార్గెట్ చేస్తూ విచారణ చేస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులో స్క్రీన్ప్లే, డైరెక్షన్ మొత్తం చంద్రబాబుదేనని.. సీబీఐ వెనుక రాజకీయ ప్రమేయం కచ్చితంగా ఉందని అన్నారు.
సీబీఐ విచారణ పేరిట డ్రామా జరుగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు సజ్జల. కింది స్ధాయి సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని.. చంద్రబాబు చెప్పిన ప్రకారమే వారు నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా మరో కొత్త అంశం తెర మీదకు తీసుకొచ్చారు సజ్జల.
రెండో పెళ్లి విషయమూ వివేకా హత్యకు కారణమై ఉండవచ్చని.. ఆ కోణంలో ఎందుకు విచారించడం లేదని.. ఈ విషయం ఓ మీడియాలోనూ వచ్చిందని సజ్జల ప్రస్తావించారు. వివేకా హత్య కేసులో తప్పుడు ప్రచారం చేస్తూ జగన్ వైపు తీసుకువచ్చే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. సీబీఐ విచారణ తీరుపై సరైన సమయంలో కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.