Adi Shankara:కనకధారా స్తోత్రం శ్రీ మహాలక్ష్మీ దేవిని కీర్తిస్తూ ఆది శంకరాచార్యులు రచించిన మొదటి సంస్కృత స్తోత్రం. సకలసంపత్ప్రదాయకమని ఈ స్తోత్రం పారాయణ పట్ల భక్తులకు విశ్వాసం ఉండడం వలన, ఈ స్తోత్రంలోని పద, భావ సౌందర్యం వలన అత్యంత ప్రాచుర్యం కలిగిన లక్ష్మీదేవి ప్రార్థనలలో ఇది ఒకటిగా నిలుస్తొంది.మానవాళికి కనకధారా స్తోత్రం ఓ పెద్ద వరం. దీనిని క్రమంతప్పకుండా నిష్టగా పారాయణం చేస్తే, ఇంట్లో కనక వర్షం కురుస్తుందన్నది అశేష భక్త జనం యొక్క విశ్వాసం.
ముఖ్యంగా దసరా నవరాత్రులలో.. దుర్గమ్మకు ఎంతో ప్రీతిపాత్రమైన కనధార స్తోత్రం పఠిస్తే ఎన్నో ప్రయోజనాలుంటాయని శాస్త్రాలు చెపుతున్నాయి. ఈ స్తోత్రం ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. జగద్గుర ఆదిశంకరులు భిక్ష కోసం ఒక పేదబ్రాహ్మణుని ఇంటికి వెళ్ళారట.యజమాని ఇంట లేని సమయంలో కటిక దరిద్రంతో బాధపడుతున్నఆ ఇల్లాలు దిక్కు తోచని స్థితిలో ఇంట్లో వెతికితే ఒక ఉసిరికాయ కనిపించింది. ఆ ఉసిరి కాయను దానం చేసింది ఆ మహాతల్లి. వారి దారిద్ర్యాన్ని తొలగించమని శంకరులు లక్ష్మీ దేవిని ప్రార్థించారు. లక్ష్మి ప్రసన్నమై ఆ ఇంట బంగారు ఉసిరికాయలు ధారగా కురిపించింది.
ఈ స్తోత్రంలో తొలి శ్లోకమే ఎంతో భావగర్భితంగా వుండి భక్తుల హృదయాలను పవిత్రం చేస్తుంది. యాంత్రికంగా ప్రారంభించినా, క్రమక్రమంగా ఈ స్తోత్రం యొక్క భావం, అర్ధం తెలుసుకొని పఠిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయని పండితుల భావం. కనకధారా స్తోత్రంలో శ్రీ మహావిష్ణువును మేఘంతో , మహాలక్ష్మి ని మెరుపుతో శంకరులు పోల్చారు. వ్యక్తి లేదా అతని కుటుంబం పడుతున్న కష్టాలను దారిద్రాన్ని క్షణకాలంలో మెరుపు వేగంతో పోగొడుతుంది. ఆ చల్లని తల్లిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తి శ్రద్ధలతో, పవిత్రమైన మనస్సుతో కనకధారా స్త్రోత్రాన్ని పఠించడం ఒక రాచమార్గంగా ఆదిశంకరులు అభివర్ణించారు. మంత్రాలను పఠించడం లేదా భగవంతుడిని ప్రార్థించడం వల్ల ఆత్మ నుండి సానుకూల శక్తిని బయటకు తెస్తుంది. మేధస్సుకు ప్రయోజనకరమైన కార్యకలాపాలలో మునిగిపోవడానికి మనకు సహాయపడుతుంది.