KMC: పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి ఘటనతో వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజ్-KMC పేరు మరోసారి మారుమోగిపోతోంది. ర్యాగింగ్ విషయంలో కేఎంసీకి ఇప్పటికే చాలా బ్యాడ్ నేమ్ ఉంది. ఇప్పుడు ప్రీతి మరణంతో కేఎంసీ అంటేనే హడలిపోతున్నారు విద్యార్థులు.
నిమ్స్కు వెళ్లి ప్రీతి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసిన సమయంలో వైద్య విద్య డైరెక్టర్ రమేష్రెడ్డి కొన్ని కఠోర వాస్తవాలను బయటపెట్టారు. ఎంబీబీఎస్లో ర్యాగింగ్ ఉంటుందేమో కానీ.. పీజీలో కాదంటూ అసలు విషయం చెప్పేశారాయన. కేఎంసీలో మెడిసిన్ అంటే జూనియర్ మెడికోలకు టార్చరే.
ఇక, ప్రీతి విషయంలో అనేక ప్రశ్నలు. ప్రీతి తండ్రి నరేందర్ మాటలను బట్టి.. అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ సైఫ్ వేధిస్తున్నాడంటూ వరంగల్ ఏసీపీ కిషన్కు గతంలోనే ఫిర్యాదు చేశారట నరేందర్. సైఫ్ టార్చర్పై కేఎంసీ ప్రిన్సిపల్కు కూడా కంప్లైంట్ చేశానని అంటున్నారు. వారే కనుక సకాలంలో స్పందించి ఉంటే.. ఇప్పుడు ప్రీతి చనిపోయి ఉండేదా?
మెడిసిన్లో సీటు కొట్టడమే కష్టమైన పని. కొందరి జీవితాశయం. అలాంటిది ఓ గిరిజన బిడ్డ వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు చేరడం గొప్ప విషయం. ఎంతో మందికి ఆదర్శం. అలాంటి ప్రీతికి పని ప్రదేశంలో వేధింపులు వాస్తవం. మూడు నెలలుగా నలిగిపోయింది. ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తే.. నిందితుడికి, బాధితురాలికి కౌన్సెలింగ్ ఇచ్చామని చెప్తున్నారు. మరి, ఎందుకు ప్రీతి బలవన్మరణానికి పాల్పడినట్టు? కౌన్సెలింగ్లో దమ్ము లేదా? ఏకపక్షంగా సాగిందా?
ఈ క్రమంలో తనపైనే ఫిర్యాదు చేస్తావా?.. అంటూ పీజీ వైద్యుల వాట్సాప్ గ్రూప్లో.. రిజర్వేషన్ కోటాలో సీటు వస్తే చదువు విలువ ఏం తెలుస్తుందంటూ ప్రీతి టార్గెట్గా సైఫ్ పెట్టిన పోస్ట్ ఆమెను మరింత కుంగదీసి ఉంటుంది. ఆత్మహత్యకు పురిగొల్పి ఉంటుంది.
కాకతీయ మెడికల్ కాలేజ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలోనే ప్రాణాలు తీసుకునే దుస్థితి దాపురిస్తే.. మరో అమ్మాయి ఉన్నత చదువులు చదివేందుకు ముందుకొస్తుందా? బాలికా విద్యను ప్రోత్సహిస్తామని, అన్ని విధాలుగా అండగా ఉంటామని పాలకులు చెప్పే మాటలను నమ్ముతారా?
ర్యాగింగ్ ఘటనల్లో వరంగల్, కాకతీయ మెడికల్ కాలేజీ ఇమేజ్ పలుమార్లు డ్యామేజ్ అయింది. రెండేళ్ల క్రితం ఉత్తరాదికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తకు చెందిన కూతురిని కేఎంసీలో ర్యాగింగ్ చేయడం అప్పట్లో కలకలం సృష్టించింది. కేంద్రస్థాయిలో ఒత్తిడి రావడంతో ఆ విషయం బయటకు రాకుండా మేనేజ్ చేశారు. అదే ఇయర్.. ఫ్రెషర్స్డే పేరుతో జూనియర్లను సీనియర్లు వేధించగా.. ర్యాగింగ్ చేస్తున్నారంటూ ఓ స్టూడెంట్ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర వైద్యసంచాలకులకు ట్విట్టర్లో కంప్లైంట్ చేశాడు. పోలీసులు, కళాశాల అధికారులు విచారణ జరిపి ర్యాగింగ్కు పాల్పడిన సీనియర్లను చర్యలు తీసుకున్నారు. వారిని కాలేజ్ నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచీ సిటీ పోలీసులు తరుచూ కేఎంసీలో సదస్సులు నిర్వహిస్తూ.. ర్యాగింగ్ చేయడం నేరం అంటూ అవగాహన కల్పిస్తున్నారు. కమిటీలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నారు. అయినా, ఏమీ ఉపయోగం ఉండటం లేదు. అవన్నీ పేరుకే. వాస్తవంలో ర్యాగింగ్ భూతం ఇంకా కేఎంసీలో స్వైరవిహారం చేస్తూనే ఉంది. ఇప్పుడు ప్రీతి బలి కావాల్సి వచ్చింది. మరి, ప్రీతి ఘటనే ఆఖరిది అవుతుందా? మెడికల్ కాలేజీ నుంచి ర్యాగింగ్ను తరిమేయగలరా? అధికారులు, పోలీసులు ఆ మేరకు హామీ ఇవ్వగలరా? మరో ప్రీతి నిర్భయంగా కాకతీయ మెడికల్ కాలేజీలో అడుగుపెట్టేలా ధైర్యాన్ని నింపగలరా?