Punjab: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో వందలాది మంది రైతులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్పై దాడి చేస్తారు. కర్రలు, ఆయుధాలు పట్టుకొని పోలీసులపై దాడికి యత్నిస్తారు. సేమ్ టూ సేమ్ ఇటువంటి ఘటనే పంజాబ్లో చోటుచేసుకుంది. అజ్నాలా పోలీస్ స్టేషన్పై వందలాది మంది కత్తులు, తుపాకులతో దాడి చేశారు. పోలీసులు తమ నేతను అరెస్ట్ చేయడంతో ఆందోళన నిర్వహించారు.
వారిస్ పంజాబ్ దే మత సంస్థ చీఫ్ అమత్ పాల్ సింగ్ సన్నహితుడు లవ్ ప్రీత్ తుఫాన్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. దీంతో అమృత్ పాల్ సింగ్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కత్తులు, తుపాకులతో దాడి చేశారు. పెద్ద ఎత్తున స్పీకర్లు పెట్టి పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ కుట్రతోనే లవ్ ప్రీత్ను అరెస్ట్ చేశారని ఆరోపించారు.
పోలీసులు వారిని అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ తోసుకుంటూ ముందుకెళ్లడంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. పరిస్థితి ఉద్రిక్తకరంగా మారడంతో అధికారులు దిగొచ్చారు. లవ్ప్రీత్ను విడుదల చేయాలని నిర్ణయించారు.