Dogs: ప్రజలందరినీ కలిచివేసిన దృశ్యం. నాలుగేళ్ల బాలుడిని వీధికుక్కలు వేటాడి చంపేసిన దారుణం. ఏడు కుక్కలు చుట్టుముట్టి.. ఆ చిన్నారిని పీక్కుతిన్న భయానక విషయం. సీసీకెమెరాలో రికార్డైన ఆ విజువల్స్ను చూసిన వాళ్లంతా హడలిపోయారు. మరీ ఇంత ఘోరమా.. అయ్యో పాపం అంటూ బాధపడ్డారు. సర్కారు నిర్లక్ష్యం వల్లే ఇంత దారుణం జరిగిందని మండిపడ్డారు.
హైదరాబాద్ అంబర్పేటలో బాలుడిని కుక్కలు చంపేసిన ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది తెలంగాణ హైకోర్టు. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడని మండిపడింది. వీధి కుక్కలు పసిపిల్లల ప్రాణాలు తీస్తుంటే అసలు జీహెచ్ఎంసీ ఏం చేస్తోందని? ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని? ప్రశ్నించింది హైకోర్టు.
తెలంగాణ చీఫ్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ కలెక్టర్, తెలంగాణ లీగల్ సేల్ అథారిటీ, అంబర్ పేట్ మున్సిపల్ అధికారికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. బాలుడి మృతి బాధాకరమని వ్యాఖ్యానించిన హైకోర్టు.. నష్ట పరిహారం చెల్లింపు అంశాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.
మరోవైపు, కుక్కల దాడి ఘటనతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి తలసాని అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాలుడు చనిపోవడం బాధాకరమన్నారు. మేయర్ వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరించాయని తప్పుబట్టారు.
కుక్కల నియంత్రణకి 8 స్పెషల్ టీమ్స్తో డ్రైవ్ చేపడుతోంది సర్కారు. స్టెరిలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తోంది. టోల్ ఫ్రీ నెంబర్, ప్రత్యేక యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రకటించింది. హెల్ప్ లైన్ నెంబర్ 040 – 2111 1111 అందుబాటులోకి తీసుకువచ్చింది.
కుక్క కాటు నియంత్రణపై 13 అంశాలతో మార్గదర్శకాలు విడుదల చేసింది. నగరంలో హోర్డింగ్స్ పెట్టడం, వీధి కుక్కలను దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవడం తదితర కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధం అవుతోంది.