Viveka Murder: వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సీబీఐ విచారణలో కీలక ఘటనలు వెలుగు చూశాయి. పక్కాగా ఎంక్వైరీ చేశారు సీబీఐ అధికారులు. వివేకా హత్యకు ఎవరెవరు కుట్ర పన్నారు.. ఎంత డబ్బు చేతులు మారింది.. పథకాన్ని ఎలా అమలు చేశారు.. ఎవరు హత్య చేశారు.. హత్య తర్వాత ఆధారాలు ఎవరు చెరిపేశారు.. ఇలా ప్రతీ అంశంపై లోతుగా దర్యాప్తు చేసింది. ఆ వివరాలను కౌంటర్ రూపంలో సీబీఐ కోర్టులో ప్రొడ్యూస్ చేసింది.
వివేకా హత్య కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ దాఖలు చేసిన బెయిలు పిటిషన్లో సీబీఐ కౌంటరు దాఖలు చేస్తూ వివేకా హత్యకు పన్నిన కుట్ర గురించి వెల్లడించింది. అప్రూవర్గా మారిన దస్తగిరితో పాటు ఇతరుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తులో పలు అంశాలు వెలుగు చూశాయని వివరించింది. ఆ కౌంటర్లో సీబీఐ నమోదు చేసిన వివరాలు ఇలా ఉన్నాయి….
“2019 మార్చి 14న వైఎస్ అవినాశ్రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఎదురుచూస్తున్నాడు. రాత్రి 8.30 గంటలకు దస్తగిరి గొడ్డలి తీసుకుని వచ్చాడు. పథకం ప్రకారం అవినాశ్రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డి రెండు ఫోన్లను స్విచ్ఛాఫ్ చేశారు”.
రాత్రి 9 నుంచి 9.30 గంటల మధ్య వివేకా ఇంటి సమీపంలో సునీల్ యాదవ్, దస్తగిరి కలిసి మద్యం తాగడం స్టార్ట్ చేశారు. రాత్రి 11.45 గంటల వరకు మద్యం తాగుతూ ఉండగా, అప్పుడే వివేకా కారు ఆయన ఇంట్లోకి వెళ్లినట్టు గుర్తించారు. ఉమాశంకర్రెడ్డి కూడా వారి దగ్గరికి వచ్చాడు.
అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో సునీల్యాదవ్, ఉమాశంకర్రెడ్డి, దస్తగిరిలు వెనుకవైపు కాంపౌండ్ దాటి వివేకా ఇంట్లోకి వెళ్లారు. వారికి గంగిరెడ్డి సహకరించాడు. వారిని చూసిన వివేకా.. ఈ సమయంలో ఎందుకొచ్చారని ప్రశ్నించారు. డబ్బు లావాదేవీలు మాట్లాడటానికి వచ్చారని గంగిరెడ్డి వివేకాకు సర్దిచెప్పాడు. కాసేపటికి సునీల్ యాదవ్ తిడుతూ.. వివేకా ఛాతీపై కొట్టడం ప్రారంభించాడు. దస్తగిరి నుంచి ఉమాశంకర్రెడ్డి గొడ్డలి తీసుకుని వివేకా నుదుటిపై దాడి చేయడంతో తీవ్రగాయమైంది.
డ్రైవర్ ప్రసాద్ తనను కొట్టినట్లు వివేకాతో బలవంతంగా లేఖ రాయించారు. తర్వాత గాయాలతో ఉన్న వివేకాను బాత్రూంలోకి తీసుకెళ్లి తలవెనుక ఏడెనిమిదిసార్లు ఉమాశంకర్రెడ్డి గొడ్డలితో దాడి చేశాడు. సునీల్ యాదవ్ వివేకా మర్మాంగాలపై బలంగా తన్నాడు. వివేకా చనిపోయాడని నిర్ధారించుకున్నాక.. వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. వాచ్మన్ రంగన్న నిందితులను గుర్తించాడు.