Palaniswami : అన్నాడీఎంకే పగ్గాలు మాజీ సీఎం పళనిస్వామికే దక్కాయి. మరో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. పార్టీ జనరల్ సెక్రటరీగా పళనిస్వామి ఎన్నికను సుప్రీంకోర్టు సమర్థించింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి కొనసాగేలా మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా గతేడాది పళనిస్వామి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను సవాల్ చేస్తూ పన్నీర్ సెల్వం ముద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. గతేడాది జులై 11న జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం చెల్లదని పిటిషన్ లో పేర్కొన్నారు. పళనిస్వామి ఎన్నిక చెల్లదని గతేడాది ఆగస్టులో ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ జయచంద్రన్ తీర్పునిచ్చారు. దీంతో పళనిస్వామి మద్రాసు హైకోర్టులో అప్పీలు చేయగా.. జస్టిస్ జయచంద్రన్ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా పళనిస్వామి కొనసాగేందుకు అనుమతినిచ్చింది. ఈ తీర్పును పన్నీర్ సెల్వం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తాజాగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టి పన్నీల్ సెల్వం వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. పళినిస్వామి ఎన్నిక చెల్లుతుందని తీర్పునిచ్చింది.
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణించాక పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేశారు. అప్పటి నుంచి పన్నీర్ సెల్వం సమన్వయకర్తగా, పళనిస్వామి సంయుక్త సమన్వయకర్తగా కొనసాగారు. దీంతో పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగింది. పళనిస్వామి వర్గం ఏకనాయకత్వాన్ని తెరపైకి తెచ్చింది. ఇందుకు పన్నీర్ సెల్వం వర్గీయులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే 2022 జూన్ 23న పార్టీ సర్వసభ్య సమావేశంలో ఘర్షణ జరిగింది. ఆ తర్వాత జులై 11న మరోసారి సమావేశం నిర్వహించారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. కొత్తగా డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవిని తీసుకొచ్చారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో త్వరలోనే పార్టీలో ప్రధాన కార్యదర్శి ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. పళనిస్వామిని ఆ పదవికి ఎన్నుకోవడం ఇక లాంఛనమే. దీంతో అన్నాడీఎంకేపై పూర్తి పట్టు పళనిస్వామి సాధించినట్టే. మరి పన్నీర్ సెల్వం పరిస్థితి ఎంటేనదే ప్రశ్నార్థకంగా మారింది.