Karnataka : కర్ణాటకలో ఐఏఎస్, ఐపీఎస్ మహిళా అధికారుల మధ్య నడుస్తున్న వార్ ఇంకా ముదురుతోంది. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే యాక్షన్ తీసుకున్నా… ఆ ఇద్దరు వనితలు వెనక్కి తగ్గదేలేదంటూ వార్ ను కొనసాగిస్తున్నారు. వారి మధ్య వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఇద్దరు సీనియర్ ఆఫీసర్స్ పర్సనల్ ఫైట్ కర్ణాటకలో తీవ్ర సంచలనంగా మారింది. ఐఏఎస్ అధికారి రోహిణీ సింధూరి వ్యక్తిగత చిత్రాలను బయటపెడుతూ ఐపీఎస్ అధికారిణి రూపా మౌద్గిల్ ఆరోపణలు చేయడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత వారి మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే కొనసాగింది. ఆ వెంటనే కర్నాటక ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇద్దరిపై బదిలీ వేటు వేసింది. అంతేకాదు వారికి పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టింది. అయినా సరే వారు వెనక్కి తగ్గటం లేదు.
తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే తాను పోరాడుతున్నట్లు రూప తాజాగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం సంచలనం రేపుతోంది. తాను భర్తతో ఇప్పటికీ కలిసే ఉన్నానని కుటుంబం విచ్ఛిన్నం కాకుండా పోరాడుతున్నానని ఆమె పేర్కొన్నారు. కొందరి జీవితాలు నాశనం అయ్యేందుకు కారణమైన మహిళను నిలదీయక తప్పదు అని రూపా పెట్టిన పోస్టు సంచలనం సృష్టిస్తోంది.
అటు ఐఏఎస్ రోహిణీ సింధూరి లీగల్ యాక్షన్ మొదలుపెట్టారు. రూపా మౌద్గిల్ కు లీగల్ నోటీసులు పంపారు. లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పరువుకు భంగం కలిగించినందుకు, మానసిక వేదన కలిగించినందుకు రూ. కోటి పరిహారం చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారడంతో కొద్దిరోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని తెలిపారు. అలాగే తనను ఉద్దేశించి చేసిన ఫేస్బుక్ పోస్టులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రూపా మౌద్గిల్, రోహిణీ సింధూరి పరస్పరం ఆరోపణలను చేసుకోవద్దని ప్రభుత్వం ఆదేశించింది. బహిరంగ ప్రకటనలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితాశర్మ స్పష్టం చేశారు. అయినా సరే రూపా మళ్లీ ఫేస్బుక్లో పోస్టు పెట్టడంతో వివాదం కొనసాగుతోంది.