Preethi : ఆత్మహత్యకు ప్రయత్నించిన వరంగల్ మెడికల్ కాలేజీ పీజీ స్టూడెంట్ ప్రీతి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. ప్రీతిని కాపాడేందుకు డాక్టర్ పద్మజా నేతృత్వంలోని ఐదుగురు వైద్యుల బృందం ప్రయత్నిస్తోంది. అవయవాలు దెబ్బతినడంతోపాటు బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. చికిత్సకు ప్రీతి శరీరం సహకరించడం లేదని అంటున్నారు. వరంగల్ నుంచి నిమ్స్కు తీసుకువచ్చే సమయంలో రెండుసార్లు గుండె ఆగిపోయిందని.. వైద్యులు సీపీఆర్ చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా చేశారని తెలిపారు.
ఏం జరిగిందంటే?
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్లో వైద్య విద్యార్థిని ప్రీతి బుధవారం మత్తు ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే సహా విద్యార్థులు, వైద్య సిబ్బంది వరంగల్లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఎంజీఎంకు తరలించారు. ప్రీతి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన వరంగల్ నుంచి హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు.
తండ్రి ఆవేదన..
హైదరాబాద్ నిమ్స్లో తన కుమార్తెకు సరైన వైద్యం అందడం లేదని తండ్రి నరేందర్ ఆరోపించారు. మంచి ట్రీట్మెంట్ అందించి తన కుమార్తెను కాపాడాలని కోరారు. తన కుమార్తెను బతికిస్తే బిచ్చమెత్తుకుని అయినా పోషించుకుంటానంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. వరంగల్ ఎంజీఎం నుంచి హైదరాబాద్ తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ హెచ్వోడీ, సీనియర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కారణమిదేనా..?
కాకతీయ వైద్యకళాశాలలో ప్రీతి అనస్థీషియా విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్ కొన్నాళ్లుగా వేధిస్తున్నారని ఇప్పటికే కళాశాల యాజమాన్యం దృష్టికి ఆమె తీసుకెళ్లారు. అయినా సరే వేధింపులు ఆగకపోవడంతో.. బుధవారం ఉదయం ప్రీతి హానికరమైన ఇంజక్షన్ చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ప్రీతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో మట్టెవాడ ఠాణాలో డాక్టర్ సైఫ్పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదైంది.
విచారణకు కమిటీ ..
ప్రీతి ఆత్మహత్యాయత్నంపై కమిటీ ఏర్పాటైంది. నలుగురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ నియమించారు. కమిటీ నివేదికను డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్రెడ్డికి సమర్పిస్తారు.