Kerala: మానవ జీవితంలో మార్పులు వస్తున్న కొద్దీ కొత్తకొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్నపాటి రోగం అయితే నయమవుతుంది కానీ.. అరుదైన రోగం బారిన పడితే కోట్ల రూపాయిలు కుమ్మరించాల్సిందే. అయినా కూడా కొన్నిసార్లు ప్రాణాలు దక్కడం లేదు. ఇక మధ్య, పేద తరగతి ప్రజలు చికిత్స కోసం కోట్లరూపాయలు పెట్టలేక.. ప్రాణాలు దక్కించుకోలేక పడే బాధ అంతా ఇంతా కాదు.
ఇలానే కేరళకు చెందిన ఓ బాలుడు అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధికి చికిత్స కోట్ల రూపాయలతో ముడిపడి ఉంది. దీంతో బాలుడి తల్లిదండ్రులు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో ఓ వ్యక్తి దేవుడిలా వచ్చి వారిని ఆదుకున్నాడు. తన పేరు చెప్పకుండానే భారీ సాయం చేశాడు. బాధితుల ఖాతాలో ఏకంగా రూ.11 కోట్లు జమ చేశాడు.
ఎర్నాకుళానికి చెందిన నేవీ ఆఫీసర్ సారంగ్, అతిథి దంపతుల కుమారుడు నిర్వాణ్ పుట్టుకతోనే అరుదైన వ్యాధితో జన్మించాడు. బాలుడికి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధి ఉంది. ఆ వ్యాధి చికిత్సకు రూ. 17.5 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. విదేశీ వైద్యులతో చికిత్స అందించాలని వెల్లడించారు.
అన్ని డబ్బులు పెట్టి చికిత్స అందించే ఆర్థికస్థోమత లేక తల్లిదండ్రులు దాతల సాయం కోరారు. సోషల్ మీడియాలో తమ కుమారుడి పరిస్థితిని వివరిస్తూ ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోకాస్త విదేశాల్లో ఉంటున్న ఓ వ్యక్తి చూశాడు. వెంటనే తన పేరు బయటకు రాకుండా బాధితుల ఖాతాలో రూ.11 కోట్లు జమచేశాడు. ప్రస్తుతం నిర్వాణ్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.