KSRTC : ప్రయాణాలు చేసేటప్పుడు తాగుబోతులు సైకోలుగా మారుతున్నారు. తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు చర్యలు శ్రుతి మించుతున్నాయి.
ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల విమానంలో ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు ఇలాంటి చర్యకే పాల్పడ్డాడు.
కర్ణాటక ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలిపై ఓ యువకుడు మూత్ర విసర్జన చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన యువకుడే ఇలాంటి చర్యకు పాల్పడటం విస్తుపోయేలా చేసింది. విజయపుర నుంచి మంగళూరుకు వెళుతున్న కేఎస్ఆర్టీసీ బస్సు హుబ్బళ్లి సమీపంలోని కిరేసూరులో ఒక దాబా వద్ద మంగళవారం అర్ధరాత్రి ఆగింది. ఆ సమయంలో చాలా మంది ప్రయాణికులు బస్సు దిగారు.
ఈ బస్సు మందు వరుసలోని సీట్లో ఓ మహిళ నిద్రపోతున్నారు. వెనుక వరుస నుంచి రామప్ప అనే యువకుడు ముందుకు వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు బస్సు దిగేందుకు బద్దకించాడు. అంతే ముందువరుస సీట్లో ఉన్న మహిళపై మూత్రం పోశాడు. గాఢనిద్రలో ఉన్న ఆమె ఒక్కసారిగా మేల్కొని గట్టిగా అరిచారు. ఆమె కేకలు విని మిగిలిన ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్ ఒక్కసారి బస్సు వద్దకు పరుగెత్తుకుని వచ్చారు. జరిగిన విషయాన్ని ఆమె వారితో చెప్పారు. దీంతో ఆ యువకుడికి దేహశుద్ధి చేసి బస్సు నుంచి బయటకు పంపేశారు. అతడి బ్యాగులను బయటకు విసిరేశారు. ఆ మహిళ అక్కడే డాబా వద్ద స్నానం చేసి దుస్తులు మార్చుకుని తన ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయలేదు.
విమానాలు, రైళ్లు, బస్సులు ఇలా ప్రయాణాల్లో మందుబాబుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. తోటి ప్రయాణికులపై దాడులు చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగుచూశాయి. పాడుపనులు చేస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువమంది మహిళలే ఉంటున్నారు. ఇలాంటి చర్యలు నియంత్రించడంపై ప్రభుత్వ యంత్రాంగాలు చర్యలు చేపట్టాలి. మద్యం సేవించిన వారిని ప్రయాణాలకు అనుమతించకూడదని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అప్పుడు ఇలాంటి చర్యలు నియంత్రణలోకి వస్తాయని అంటున్నారు.