Governor : గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఏపీ ప్రభుత్వం వీడ్కోలు చెప్పింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో బిశ్వభూషణ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆయనకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు, గవర్నర్ ముఖ్యకార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు.
బిశ్వభూషణ్ ఏపీ గవర్నర్ గా మూడున్నరేళ్లపాటు పనిచేశారు. ఇప్పడు ఛత్తీస్ గఢ్ బదిలీ అయ్యారు. గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విజయవాడలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించింది. బిశ్వభూషణ్ ను సీఎం జగన్ సన్మానించి జ్ఞాపిక అందించారు. అదే సమయంలో సీఎం జగన్ పాలనను గవర్నర్ ప్రశంసించారు. బిశ్వభూషణ్ గవర్నర్ల వ్యవస్థకు నిండుదనం తీసుకొచ్చారని జగన్ కొనియాడారు.
మరోవైపు ఏపీకి కొత్త గవర్నర్ వస్తున్నారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జస్టిస్ నజీర్ను గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జారీ చేసిన ఉత్తర్వుల్ని పొందుపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దాన్ని గెజిట్లో నోటిఫై చేసింది. జస్టిస్ నజీర్ ఢిల్లీ నుంచి బుధవారం రాత్రి 7:30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలకుతారు. ఈ నెల 24న ఉదయం 9.30గంటలకు రాజ్భవన్లో గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేస్తారు.