Chudamani:సాధారణంగా గుడిలో ఏదైనా వస్తువు దొంగతనం చేసి తీసుకెళ్లాలంటే అపచారం అని లెంపలేసుకుంటారు. కానీ ఉత్తరాఖండ్లోని ఈ ఆలయంలోనే వింత ఆచారం ఉన్నది. రూర్కీ జిల్లాలోని చూడియాలాలో చూడామణి ఆలయానికి వచ్చిన భక్తులు కచ్చితంగా దొంగతనం చేయాల్సిందేనట. అలా చేస్తే సంతానం లేని వారికి పిల్లలు పుడతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.పురాతనమైన చూడామణి ఆలయం.. సంతాన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే అలా జరగాలంటే మాత్రం గుడికి వచ్చేవాళ్లు కచ్చితంగా దొంగతనం చేయాలట. అలా చేస్తే ఎవరూ అడ్డు చెప్పరు. దొంగతనం చేయమని స్వయానా పూజారులే ప్రోత్సహిస్తారు.
అమ్మవారి మెడలో ఉన్న బంగారమో.. గుడిలో ఉన్న డబ్బునో దొంగతనం లాంటివి దొంగతనం చేయకూడదు. అమ్మవారి పాదాల దగ్గర చెక్క బొమ్మలు ఉంటాయట. వాటిని ఎవరైతే దొంగతనం చేస్తారో వారికి అందమైన, ఆరోగ్యవంతమైన బిడ్డ పుడతారని భక్తులు నమ్ముతారు. అదంతా అక్కడ పురాతన ఆచారంలో భాగంగా చేస్తారు.
చెక్క బొమ్మను దొంగిలించి ఇంటికి తీసుకెళ్లడమే కాదు.. బిడ్డ పుట్టిన తర్వాత ఆ చెక్క బొమ్మను మళ్లీ ఎక్కడి నుంచైతే తీసుకున్నారో అక్కడే పెట్టాలట. దానితో పాటు మరొక బొమ్మను కూడా తీసుకురావలన్నది ఆ ఆలయ ఆచారమట.
ఈ ఆచారం వెనుక ఒక కథ కూడా ఉంది. లాందౌరా రాజు ఒకరోజు అడవిలో సంచరిస్తుండగా చూడామణి ఆలయాన్ని చూసి తమకు బిడ్డను ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నాడు. దీంతో అమ్మవారు మాయమై చెక్కరూపంలో దర్శనమిచ్చింది. ఆ చెక్క బొమ్మను తీసుకొని ఇంటికి వెళ్లిన రాజు దంపతులకు కొన్నాళ్ల తర్వాత పండంటి బిడ్డ పుట్టాడు. రాజు.. వెంటనే సతీసమేతంగా ఆలయానికి వెళ్లి తాను తీసుకెళ్లిన చెక్కబొమ్మతో పాటు మరో చెక్కబొమ్మనూ అమ్మవారికి సమర్పించాడట. అలా మొదలైన ఆచారం ఇప్పటికీ అలానే కొనసాగుతోంది.