YSRCP: ఈ ఫోటో మామూలుది కాదు. ఆ దృశ్యం లైట్ తీసుకునేది కానేకాదు. అందుకే ఈ టాపిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏపీ పాలిటిక్స్నూ షేక్ చేస్తోంది. విజయసాయిరెడ్డికి అన్నివర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇదంతా సరే. మరి, జగన్ ఎలా రియాక్ట్ అవుతారు? ఈ చిట్చాట్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందనే అంశం మరింత ఆసక్తికరంగా మారింది.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి తారకరత్న అల్లుడి వరుస అవుతారు. అందుకే, బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్నప్పటి నుంచీ తారకరత్న హెల్త్ ఫాలోఅప్లో ఉన్నారు. బాలకృష్ణతో మాట్లాడుతూ చికిత్సను పర్యవేక్షించారు. తారకరత్న మృతితో విషాదంలో మునిగిపోయారు. నందమూరి కుటుంబాన్ని ఓదార్చారు. అంత్యక్రియలు అయ్యే వరకూ రెండు రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఆ సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు పక్కనే కూర్చొని.. తారకరత్న కుటుంబ పరిస్థితిపై చర్చించారు. ఇదంతా విజయసాయిలోని మరో కోణాన్ని చూపించింది. అంతా బాగానే ఉందిగానీ, మరి ఈ విషయాన్ని జగన్ ఎలా తీసుకుంటారో అనే డౌట్ మాత్రం ఉండనే ఉంది.
టీడీపీ విషయంలో జగన్ చాలా సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబును, లోకేశ్ను వైసీపీ నేతలు ఎంతగా టార్గెట్ చేస్తే అంత ఖుషీ అవుతున్నారనే ప్రచారం ఉంది. మంత్రి పదవులు సైతం ఆ కోటాలోనే ఇస్తున్నారనే ఆరోపణ కూడా ఉంది. తానింతలా చంద్రబాబు అండ్ కో ను టార్గెట్ చేస్తుంటే.. తారకరత్న తన అల్లుడంటూ.. విజయసాయి నందమూరి ఇంట్లో మకాం పెట్టడం, చంద్రబాబుతో మంతనాలు జరపడం.. జగన్ దృష్టికి వెళ్లింది. చావు ఘటన కాబట్టి.. విజయసాయిని జగన్ ఎక్స్క్యూజ్ చేస్తారా? ఇందులో మానవతా కోణం మాత్రమే చూస్తారా?
ఇప్పటికే పార్టీలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యం బాగా తగ్గిపోయిందనే టాక్ ఉంది. సజ్జలనే హోల్ అండ్ సోల్ రాజకీయం చేస్తున్నారని అంటారు. జగన్ దగ్గర విజయసాయి పరపతి బాగా పడిపోయిందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో విజయసాయిరెడ్డి.. నందమూరి కుటుంబంతో మమేకమవుతూ.. చంద్రబాబుతో ముచ్చట్లు పెట్టడాన్ని జగన్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికర అంశం. ఈ విషయంపై పొలిటికల్ సర్కిల్స్లో తెగ చర్చ నడుస్తోంది. జగన్ ఎలా అనుకున్నా.. విజయసాయిరెడ్డి వ్యవహారశైలి మాత్రం విమర్శకుల నుంచీ ప్రశంసలు పొందుతోంది.
ఇటీవల నారా లోకేశ్కు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇప్పుడు బాలకృష్ణ, చంద్రబాబులతో మాటలు కలిపారు? ఏంటి సంగతి?