Nandamuri: మహేశ్ బాబు హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ మురారీ ఇటీవలే 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ సినిమా స్టోరీ లైన్ విభిన్నంగా ఉంటుంది. హీరో కుటుంబాన్ని ఓ శాపం వెంటాడుతుంటుంది. తరానికొక్కరిని ఆ శాపం బలి తీసుకుంటుంది. ఈ తరంలో హీరో మహేశ్ బాబు వంతు వస్తుంది. పలుమార్లు ప్రమాదాల నుంచి బతికిపోతాడు. చివరికి క్లైమాక్స్లో రక్తాభిషేకం జరిగి మృత్యువును జయిస్తాడు మహేశ్బాబు. ఇదీ సినిమా స్టోరీ.
మురారీ సినిమాకు ఇందిరా గాంధీ ఫ్యామిలీనే స్పూర్తి అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు దర్శకుడు కృష్ణవంశీ. గాంధీని తుపాకీతో కాల్చి చంపేశారు.. ఇందిరాగాంధీ కూడా హత్యకు గురయ్యారు.. సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో అనుమానాస్పదంగా చనిపోయారు.. రాజీవ్ గాంధీని మానవబాంబు హతమార్చింది.. ఇది రియల్ స్టోరీ. గాంధీ కుటుంబాన్ని కూడా ఏదో శాపం వెంటాడుతోందా అనే అనుమానం.
ఇదంతా ఎందుకుంటే.. తాజాగా తారకరత్న మరణంతో నందమూరి కుటుంబాన్ని కూడా ఏదైనా శాపం వెంటాడుతోందా? అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఎన్టీఆర్ అకస్మాత్తుగా చనిపోయారు.. అంతకుముందే ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు, ఆయన తనయుడు సైతం రోడ్డు ప్రమాదంలో మరణించారు.. హరికృష్ట పెద్దకుమారుడు జానకిరామ్ కార్ యాక్సిడెంట్లో కన్నుమూశాడు. హైవే మీద ట్రాక్టర్ని ఢీ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు.
జానకిరామ్ యాక్సిడెంట్లో పోయాక నాలుగేళ్లకు ఆయన తండ్రి హరికృష్ణ సైతం అదే తరహాలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. వేగంగా వెళుతూ.. డివైడర్కి కారుతో ఢీ కొట్టి మృత్యువాత పడ్డారు.
ఇక, గతేడాది ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి సూసైడ్ చేసుకున్నారు. ఉమామహేశ్వరి మానసిక సమస్యలతో బాధపడుతున్నారని.. ఆ కారణంగానే ఆత్మహత్యకి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు అన్నారు. తారకరత్న మరణంతో నందమూరి ఇంట విషాదం మరింత పెరిగింది.
అటు, తారకరత్న హాస్పిటల్ బెడ్పై ఉండగానే సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కారు ప్రమాదానికి గురయ్యారు. అదృష్టవశాత్తు ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. గతంలో 2009 ఎన్నికల ప్రచార సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సైతం కారు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో బయటపడ్డారు.
ఇదంతా చూస్తుంటే ఎన్టీఆర్ కుటుంబాన్ని ఏదో శాపం వెంటాడుతోందా? అనే అనుమానం కొందరు వ్యక్తం చేస్తున్నారు. వరుస మరణాలు దేనికి సంకేతం? అని చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా మురారీ సినిమాను గుర్తు చేస్తున్నారు.