MLC: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఉన్నది ఒక్కటే సీటు.. కానీ, ఏ పార్టీకీ సింగిల్గా మెజార్టీ లేదు. ఎవరో ఒకరు.. ఎవరికో ఒకరికి మద్దతు ఇవ్వాల్సిందే. ఎలాగూ బీఆర్ఎస్, ఎమ్ఐఎమ్ మధ్య స్నేహం ఉంది కాబట్టి.. వారిలోనే ఒకరు ఏకగ్రీవంగా ఎన్నిక అవుతారని భావించారు. కానీ, తాజా పరిణామాలతో ఓటింగ్ తప్పనిసరిగా జరగాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది.
అధికార పార్టీ బీఆర్ఎస్ కాబట్టి.. గులాబీ అభ్యర్థికే మజ్లిస్ మద్దతు ఇస్తుందని అనుకున్నారు. అయితే, ఎంఐఎంకే ఓట్లు ఎక్కువగా ఉండటంతో.. బీఆర్ఎస్ వెనక్కి తగ్గింది. మజ్లిస్ అభ్యర్థికే తమ మద్దతు ప్రకటించింది. దీంతో ఎంఐఎం గెలుపు పక్కాగా కనిపిస్తోంది.
ఎలాగూ బీఆర్ఎస్ గెలుస్తుంది కాబట్టి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని మొదట్లో బీజేపీ భావించింది. కానీ, బీఆర్ఎస్ కాకుండా ఎంఐఎం అభ్యర్థి పోటీలోకి రావడంతో.. కమలనాథులు తగ్గేదేలే అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కాకుండా.. కనీసం ఓటింగ్ అయినా జరిగేలా.. పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని కసరత్తు చేస్తోంది.
హైదరాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ కోటా మొత్తం ఓట్లు 127 ఉండగా.. అందులో 9 ఖాళీగా ఉన్నాయి. అంటే, 118 ఓట్లు ఉన్నట్టు. ఇందులో ఎంఐఎంకి 52, బీఆర్ఎస్ 41, బీజేపీకి 25 ఓట్ల బలం ఉంది. 60 ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలిచినట్టు లెక్క. అంటే.. ఏ పార్టీ కూడా సొంతంగా గెలవలేదు. ఎంఐఎంకి బీఆర్ఎస్ సపోర్ట్ చేయడంతో మజ్లిస్ అభ్యర్థిదే గెలుపు. అయినా, బరిలో నిలవాలని బీజేపీ గట్టిగా డిసైడ్ అవుతోంది. ఓడినా పర్లేదు.. పోటీలో ఉంటామని అంటోంది. క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాన్నీ కొట్టిపారేయట్లేదు. ఎంఐఎంకు మద్దతు ఇవ్వడం ఇష్టంలేని బీఆర్ఎస్ ఓటర్లు.. బీజేపీ అభ్యర్థికి ఓటు వేసే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తోంది. అదే జరిగితే అంతకంటే ఇంకేం కావాలి? అందుకే, పోటీ పక్కాగా చేయాలని చర్చలు చేస్తున్నారు కమలనాథులు.