Javed Akhtar: ఓ భారతీయుడు పాకిస్తాన్కి వెళ్లడమే గ్రేట్. ఏదో వెళ్లారే అనుకో.. వచ్చిన పని చూసుకున్నామా, తిరిగి సేఫ్గా ఇండియాకు తిరిగొచ్చేశామా.. అనేదే ముఖ్యం. సగటు భారతీయుడు ఇంతమాత్రమే ఆలోచిస్తాడు. కానీ, ప్రముఖ సినీ గేయ రచయిత, ఉర్దూ కవి జావెద్ అక్తర్ అలా కాదు. పాకిస్తాన్ వెళ్లి.. ఆ గడ్డపై నుంచి ముంబై దాడుల ఉగ్రవాదంపై ప్రశ్నించారు. పాక్ ప్రజల కుంచితబుద్ధిని ఎత్తిచూపారు. అందుకే, జావెద్ అక్తర్ ఇప్పుడు నేషన్స్ హీరోగా నిలిచారు. పాక్లో ఆయన చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే….
ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ స్మారకార్థం ఇటీవల లాహోర్లో ఫైజ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జావెద్ అక్తర్ హాజరయ్యారు. విలేకర్లు ఆయన్ను పలు ప్రశ్నలు అడగ్గా.. వాటికి జావెద్ ఇచ్చిన ఆన్సర్స్కు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి.
ఓ విలేకరి జావెద్ను ఇలా అడిగాడు.. మీరు పాకిస్తాన్కు ఎన్నోసార్లు వచ్చారు.. మీరు తిరిగి వెళ్లాక.. మీ ప్రజలకు పాక్ వాళ్లు మంచోళ్లు అని, బాంబులు పేల్చే రకం మాత్రమే కాదు.. పూలమాలతో ప్రేమను కూడా కురిపిస్తారని అక్కడి ప్రజలకు మీరు ఎప్పుడైనా చెప్పారా? అని ప్రశ్నించాడు. దానికి జావెద్ అక్తర్ ఏమన్నారంటే….
ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు.. పైగా ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి.. వాటిని తగ్గించాల్సిన అవసరముంది.. ముంబై ప్రజలమైన మేము.. ఉగ్రవాద దాడులను కళ్లారా చూశాం.. దాడికి పాల్పడినవాళ్లు ఎక్కడో నార్వే నుంచో, ఈజిప్ట్ నుంచో రాలేదు.. వాళ్లు ఇప్పటికీ మీ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు.. అలాంటప్పుడు భారతీయుల కోపానికి అర్థం ఉంది.. దానిపై మీరు ఫిర్యాదు చేయడానికి వీల్లేదు.. అంటూ జావెద్ ఘాటు రిప్లై ఇచ్చారు.
అక్కడితో అయిపోలేదు జావెద్ అటాక్స్. పాక్ దిగ్గజాలకు భారతదేశం ఆతిథ్యమిచ్చిన రీతిలో భారతీయ కళాకారులకు పాకిస్తాన్లో స్వాగతం లభించలేదని ఎత్తిచూపారు. ఫైజ్ సాబ్ భారత్కు వచ్చినప్పుడు ఆయన్ని ప్రముఖ సందర్శకుడిగా భావించింది భారత్. అదంతా అంతటా ప్రసారం అయ్యింది. అలాగే భారత్లో నుస్రత్ ఫతేహ్ అలీ ఖాన్, మెహ్దీ హాసన్లకు గౌరవ సూచికంగా పెద్ద ఎత్తున్న వేడుకలను నిర్వహించాం. మరి మీరు(పాకిస్తాన్వాసులు) లతా మంగేష్కర్ కోసం ఏదైనా వేడుక నిర్వహించగలిగారా? అని ప్రశ్నించారు. జావెద్ అక్తర్ సమాధానంతో పాక్ మీడియా గమ్మున ఉండిపోయింది.
జావెద్ అక్తర్ ప్రసంగ వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్గా మారాయి. నటి కంగనా రనౌత్ సైతం ఆ వీడియోను షేర్ చేసి.. పాక్పై సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో ప్రధాని మోదీ చేసిన పంచ్ డైలాగ్ను గుర్తుచేసేలా.. “ఘర్ మే గుస్ కే మారా”.. అంటూ కామెంట్ చేశారు.