Biden: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం. ఏడాది కావొస్తోంది. ఉక్రెయిన్ నగరాలు మరుభూమిలా మారాయి. రష్యా భీకర దాడి అసలేమాత్రం తగ్గలేదు. అయినా సరే లొంగేదేలే అంటోంది ఉక్రెయిన్. ఆ దేశానికి అమెరికా అన్ని విధాలుగా అండగా ఉంటోంది. ఉక్రెయిన్ కు యూఎస్ సాయంపై రష్యా మండిపడుతోంది. అమెరికాపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇలాంటి సమయంలో యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ సడెన్ గా ఉక్రెయిన్ లో ప్రత్యక్ష మవడం మరింత కలకలం రేపుతోంది. రష్యాను మరింతగా రెచ్చగొట్టినట్టు అయింది.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీవ్ లో అడుగుపెట్టారు. ఆయనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వాగతం పలికారు. అధ్యక్ష భవనం ‘మారియిన్స్కీ ప్యాలెస్’లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ‘ఏడాది తర్వాత కూడా కీవ్ దీటుగా నిలబడింది. ఉక్రెయిన్తోపాటు ప్రజాస్వామ్యం కూడా నిలబడింది’ అని బైడెన్ అన్నారు. కీవ్లో బైడెన్ పర్యటన.. ‘ఉక్రెనియన్లు అందరికీ అండగా ఉన్నామని తెలిపే అత్యంత ముఖ్యమైన సంకేతం’ అని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు.
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యకు దిగి.. ఈ నెల 24వ తేదీతో ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు ఆ దేశంలో అడుగుపెట్టి రష్యాకు షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్ కు యూఎస్ సపోర్ట్ పై పుతిన్ మొదటినుంచీ గుర్రుగా ఉన్నారు. రాడార్లు, క్షిపణులు, యుద్ధ ట్యాంకులు సరఫరా చేస్తూ ఉక్రెయిన్ కు అండగా నిలుస్తోంది అమెరికా. ఇప్పుడు రష్యా ఎంతగా వ్యతిరేకిస్తున్నా.. యుద్ధ భూమిలో అడుగుపెట్టి పుతిన్ ను మరింతగా కవ్వించారు జో బైడెన్. మరి, రష్యా ఊరుకుంటుందా? ఈ పరిణామం ఉక్రెయిన్ కు మరెంతగా నష్టం చేకూర్చుతుందో?