Love Death: ఈమధ్య లవ్ మర్డర్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమించలేదని అమ్మాయిల గొంతు కోస్తున్నారు ఉన్మాదులు. ఢిల్లీలో అయితే డేటింగ్ హత్యలే. కొన్నాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు.. పెళ్లి అనగానే ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనల మధ్య.. తెలంగాణకు చెందిన ఓ యువజంట మరణం తీవ్ర విషాదం నింపుతోంది.
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఆమె పేరు సంఘవి. వయసు 21. డిగ్రీ చదివింది. అతను శ్రీకాంత్ (25). ఆటో డ్రైవర్. అయితేనేం.. వారి పెళ్లికి అవేవీ అడ్డంకి కాలేదు. వాళ్లిద్దరిదీ ఓకే ఊరు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ. కొంతకాలం సీక్రెట్ గా లవ్ ట్రాక్ నడిపారు. అయితే ఇలాంటివి ఎన్నో రోజులు దాగవుగా. వన్ ఫైన్ డే.. వారి లవ్ మేటర్ ఇంట్లో తెలిసిపోయింది. పెద్దలేమీ వారి ప్రేమకు నో చెప్పలేదు. పైగా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. త్వరలోనే పెళ్లి చేసేందుకు సిద్ధమవుతుండగా.. అంతలోనే విషాదం.
పెళ్లంటే భయపడ్డాడు శ్రీకాంత్. తాను బతికేది ఆటో నడుపుకుంటూ. ఇంకా సెటిలే కాలేదు. అందులోనూ బోలెడు అప్పులు. ఈ టైమ్ లో పెళ్లి చేసుకుంటే.. బతికేది ఎట్టా? భార్యను పోషించేది ఎలా? అంటూ బెదిరిపోయాడు. మాట్లాడుకుందాం రా.. అంటూ సంఘవిని తీసుకుని ఎల్లంపల్లి జలాశయం వైపునకు ఆటోలో వెళ్లాడు. అక్కడ ఆమెకు తన అప్పుల విషయం చెప్పాడు. పెళ్లి చేసుకుంటే జీవితం కష్టంగా మారుతుందని.. వివాహం చేసుకోలేనని చెప్పాడు. వెంటనే తనతో తెచ్చుకున్న పురుగులమందు తాగేశాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంఘవి.. అంతలోనే తేరుకుని, అతని నుంచి పాయిజిన్ బాటిల్ లాక్కొని.. చస్తే ఇద్దరమూ చద్దాం.. అంటూ పురుగులమందును ఆమె కూడా గడగడా తాగేసింది.
కాసేపటికి వారిలో చావు భయం మొదలైంది. బతకాలనే ఆశ పుట్టింది. అప్పటికే కాస్త మగతగా ఉంది. అయినాసరే, ఆటోలో సంఘవిని కూర్చోబెట్టుకుని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు శ్రీకాంత్. ఈలోగా దారిలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.
ప్రభుత్వ హాస్పిటల్ లో పరిస్థితి విషమంగా మారడంతో.. వారిద్దరినీ ప్రైవేట్ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గంటల వ్యవధిలోనే వారిద్దరూ చనిపోయారు. అలా ఆ ప్రేమజంట క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. గ్రామస్తులను కలచివేసింది. చావులోనూ జంటగా ఉన్న ఆ జోడి గురించి స్థానికంగా చర్చించుకుంటున్నారు.