Rohini: రోహిణి సింధూరి. ఐఏఎస్ అధికారి. రెగ్యులర్ గా న్యూస్ ఫాలో అయ్యే వారికి ఈమె తెలిసే ఉంటుంది. కర్నాటకలో ఇటీవల రోహిణీ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. లేటెస్ట్ గా రోహిణి సింధూరి ఎపిసోడ్ లో మరో ఐపీఎస్ అధికారిణి కూడా ఎంటర్ అవడం కలకలం రేపుతోంది. పక్క రాష్ట్రంలో రచ్చ రచ్చ అవుతోంది.
ఇద్దరు ఉన్నతాధికారులు. అందులోనూ మహిళలు. కలిసిమెలిసి పని చేసుకోవాల్సింది పోయి.. చీప్ పాలిటిక్స్ లో మునిగిపోయారు. ఐఏఎస్ అధికారిణి రోహిణీ సింధూరి పర్సనల్ ఫొటోలను.. ఐపీఎస్ ఆఫీసర్ రూపా మౌద్గిల్ సోషల్ మీడియాలో షేర్ చేయడం కాంట్రవర్సీగా మారింది.
జస్ట్ ఫోటోలు షేర్ చేయడమే కాదు.. పలు హాట్ కామెంట్స్ కూడా చేశారు ఆ ఐపీఎస్ అధికారిణి రూపా. రోహిణీ సింధూరికి చెందిన ఈ వ్యక్తిగత ఫోటోలను గతంలో ఆమెనే పలువురు పరుష ఐఏఎస్ లకు షేర్ చేశారని కామెంట్ చేసింది. 2021 నుంచి 2022 మధ్య ఈ ఫోటోలను ముగ్గురికి పంపారని అన్నారు. ఆ ఫోటోలే తానిప్పుడు షేర్ చేస్తున్నానని చెప్పారు. అలాగే, రోహిణీ సింధూరిపై పలు అవినీతి ఆరోపణలు కూడా చేశారు. రోహిణిపై సీఎస్ కు కంప్లైంట్ కూడా చేశానని చెప్పారు రూపా మౌద్గిల్.
విషయం తెలిసి ఐఏఎస్ రోహిణి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్ స్క్రీన్ షాట్లు సేకరించి.. తన పరువుకు భంగం కలిగించేలా వాటిని షేర్ చేశారని మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలను ఖండించారు. తాను ఫోటోలు పంపిన ఆ ముగ్గురు పురుష ఐఏఎస్ లు ఎవరో పేర్లు చెప్పాలని సవాల్ చేశారు. ఐపీఎస్ రూపపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఇద్దరు అధికారులు ఇలా బజారున పడి తగువులాడుకోవడంపై కర్నాటక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వారి వ్యవహారంపై సీఎం, పోలీసు చీఫ్తో చర్చించినట్టు హోంమంత్రి తెలిపారు.
ఐఏఎస్ రోహిణి సింధూరి.. గతంలో జేడీఎస్ ఎమ్మెల్యే మహేశ్తో ఒక రెస్టారెంట్లో రోహిణి దిగిన ఫోటో వైరల్ అయింది. అప్పుడు కూడా ఐపీఎస్ రూప మౌద్గిల్ ఇలానే ప్రశ్నించారు. వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఐఏఎస్ రోహిణి సింధూరి పర్సనల్ ఫోటోలను షేర్ చేసి.. రచ్చ మరింత రాజేసింది ఐపీఎస్ రూపా. ఇలా ఇద్దరు మహిళా ఉన్నతాధికారుల ఫోటో ఫైట్ కర్నాటకలో హాట్ టాపిక్ గా మారింది.