Tarakaratna: నందమూరి తారకరత్న అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఫిల్మ్ఛాంబర్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. తారకరత్న తండ్రి మోహనకృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. బాలకృష్ణ, నందమూరి కుటుంబ సభ్యులు పాడెమోశారు. చివరిసారిగా తారకరత్నను చూసేందుకు సినీప్రముఖులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. అంతిమయాత్రలో పాల్గొని తారకరత్నకు అశ్రునయనాల మధ్య కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు.
జనవరి 27న నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్పటి నుంచి 23 రోజులపాటు బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 18న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి మోకిలలోని తన నివాసానికి 19న ఉదయం తరలించారు. సోమవారం ఉదయం మోకిల నుంచి హైదరాబాద్లోని ఫిల్మ్ఛాంబర్కు తరలించారు. ప్రజలు, అభిమానులు సందర్శనార్థం భౌతికకాయాన్ని అక్కడ ఉంచారు.
తారకరత్న మృతితో నందమూరి కుటుంబంలో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతిని తెలుగు చలనచిత్ర పరిశ్రమతోపాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.