IPHONE: కొత్త స్మార్ట్ఫోన్లు ఎన్ని మార్కెట్లోకి వచ్చినా.. ఐఫోన్ కుండే క్రేజే వేరు. ఎన్ని కంపెనీలు పోటీపడినప్పటికీ యాపిల్ను ఢీ కొట్టలేకపోతున్నాయి. ఇక ఐఫోన్ను కొనడం కూడా అంత తేలికైన విషయం కాదు. ఒక్క ఐఫోన్కు పెట్టే డబ్బులతో ఆండ్రాయిడ్ ఫోన్లు నాలుగైదు కొనుక్కోవచ్చు. అలాగే ఐఫోన్ చేతిలో ఉంటే వచ్చే కిక్కు ఒక్క యాపిల్ ప్రియులకు మాత్రమే అర్థమవుతుంది. ఐఫోన్ కోసం కిడ్నీలను అమ్ముకున్న వాళ్లు కూడా ఎందరో ఉన్నారు.
ఇలాగే కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఓ వ్యక్తి ఐఫోన్ కోసం ఓ డెలివరీ బాయ్ ప్రాణాలు తీశాడు. ఫిబ్రవరి 7న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హేమంత్ దత్త అనే యువకుడు ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ ఐఫోన్ ఆర్డర్ చేశాడు. అతని దగ్గర చిల్లిగవ్వకూడా లేకపోయినా రూ. 46 వేల విలువైన ఫోన్ను బుక్ చేశాడు. ఈక్రమంలో ఇ-కార్ట్ ఎక్స్ప్రెస్ డెలివరీ బాయ్ ఫిబ్రవరి 7న ఫోన్ తీసుకొని హేమంత్ ఇంటికి వెళ్లాడు. అయితే బాక్స్ ఓపెన్ చేసి ఫోన్ చూపిస్తేనే డబ్బులు ఇస్తానని హేమంత్ పట్టుపట్టాడు. అలా కుదరదని.. డబ్బులు ఇస్తేనే ఫోన్ ఇస్తానని డెలివరీ బాయ్ తేల్చిచెప్పాడు.
ఈక్రమంలో వారిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఆతర్వాత బయటకు వెళ్లి డబ్బులు తీసుకొస్తానని.. కాసేపు ఇంట్లో కూర్చోమని డెలివరీ బాయ్ను హేమంత్ నమ్మించాడు. కొంత సమయం తర్వాత డెలివరీ బాయ్పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో డెలివరీ బాయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఆ తర్వాత నాలుగు రోజుల పాటు మృతదేహాన్ని బాత్రూమ్లో దాచి పెట్టాడు. మృతదేహం నుంచి వాసన రావడంతో ఓ సంచిలో మూటకట్టుకొని దగ్గర్లోని రైల్వే ట్రాక్ దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అయితే నాలుగురోజులైనా ఇంటికి రాకపోవడంతో.. డెలివరీ బాయ్ తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. డెలివరీ బాయ్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు జరపగా.. హత్యా ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో హేమంత్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.
Morbi Bridge : మోర్బీ దుర్ఘటనపై సిట్ నివేదిక.. ప్రమాదానికి కారణాలివే..?
Asaduddin Owaisi : ఢిల్లీలో ఓవైసీ ఇంటిపై దుండగులు దాడి.. కిటికీలు ధ్వంసం..