Morbi Bridge : గతేడాది అక్టోబర్ 30న గుజరాత్ లో ఘోర దుర్ఘటన జరిగింది. మోర్బీ నగరంలో మచ్ఛు నదిపై తీగల వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో 135 మంది మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటనపై గుజరాత్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ప్రమాదంపై దర్యాప్తు చేసిన సిట్ కీలక విషయాలు వెల్లడించింది.
ప్రమాద సమయానికి వంతెనలోని ప్రధాన కేబుల్లో సగం తీగలు తుప్పు పట్టాయని సిట్ నిర్ధారించింది. పాత సస్పెండర్ ప్లాట్ ఫామ్, కేబుల్ను కలిపే స్టీల్ రాడ్ లనే కొత్త వాటితో వెల్డింగ్ చేశారని గుర్తించింది. ఇలాంటి ప్రధాన లోపాలే ప్రమాదానికి దారితీశాయని సిట్ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదానికి ముందే ఓ ప్రధాన తీగలో సగం వైర్లు తెగిపోయినట్లు నిర్ధారించింది.
1887 నాటి వంతెన రెండు ప్రధాన తీగల్లో.. నదికి ఎగువ వైపు కేబుల్ తెగిపోయి ప్రమాదం జరిగింది. వంతెన ప్రధాన కేబుళ్లు.. ఏడు ఉప తీగలు, అందులో ప్రతి తీగ మళ్లీ ఏడు ఉక్కువైర్లను కలిగి ఉన్నాయి. ఇలా మొత్తం 49 వైర్లతో కేబుల్ను రూపొందించారు. అయితే తెగిపోయిన కేబుల్లో 22 వైర్లు అప్పటికే తుప్పు పట్టాయి. ప్రమాదానికి ముందే అవి తెగిపోయినట్లు సిట్ నిర్ధారించింది. మిగతా తీగలు ప్రమాద సమయంలో తెగిపోయాయని పేర్కొంది.
కూలిపోయే సమయంలో వంతెనపై దాదాపు 300 మంది సందర్శకులు ఉన్నారు. ఇది వంతెన సామర్థ్యం కంటే చాలా ఎక్కువ. ప్లాట్ఫామ్ పై ఉన్న చెక్క పలకలను అల్యూమినియం ప్యానెళ్లతో మార్చడం కూడా ప్రమాదానికి దారితీసిందని గుర్తించింది. ఆ ప్యానెళ్ల కారణంగా వంతెన బరువు పెరిగిందని చెప్పింది. చెక్క పలకలు ఉంటే ప్రాణనష్టం తక్కువగా ఉండేదని పేర్కొంది. వంతెనను తిరిగి ప్రారంభించడానికి ముందు నిర్మాణ, సామర్థ్య పరీక్షలు చేయలేదని సిట్ నివేదిక స్పష్టం చేసింది.
మోర్బీ వంతెన మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలను ఒరేవా గ్రూప్ చేపట్టింది. ఇందులో చాలా లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు ఒరెవా గ్రూప్ ఎండీ జయసుఖ్ పటేల్ సహా 10 మంది నిందితులను ఇప్పటికే అరెస్టు చేశారు.
Asaduddin Owaisi : ఢిల్లీలో ఓవైసీ ఇంటిపై దుండగులు దాడి.. కిటికీలు ధ్వంసం..
IPHONE: ఐఫోన్ కోసం దారుణం.. డబ్బుల్లేక డెలివరీబాయ్ హత్య