Railways New Service:రైళ్లలో రాత్రి పూట ప్రయాణాలు చేసే వాళ్లు… గాఢ నిద్ర కారణంగా దిగాల్సిన స్టేషన్ మిస్ కావడం చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. మొబైల్లో అలారం పెట్టుకున్నా అది సరిగ్గా సమయానికి మోగకపోవడం, దిగాల్సిన స్టేషన్ వచ్చిందని అలర్ట్ చేసేవాళ్లు ఎవరూ లేకపోవడం వల్ల… చాలా దూరం ప్రయాణించాక గానీ కొందరికి మెలకువ రాదు. దాంతో… లేచాక వచ్చే స్టేషన్లో దిగిపోయి.. మళ్లీ వెనక్కి రావడం చాలా మంది రైలు ప్రయాణికులకు అనుభవమే. ఇకపై ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టింది… రైల్వే శాఖ. దిగాల్సిన స్టేషన్ రావడానికి 20 నిమిషాల ముందే ప్రయాణికులను అలర్ట్ చేసేలా కొత్త సర్వీసు ప్రవేశపెట్టింది.
రైల్వే శాఖ ప్రారంభించిన ఈ ప్రత్యేక సేవ పేరు ‘డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం’. రైల్వే హెల్ప్లైన్ నెంబర్ 139కి కాల్ చేసి విచారణ వ్యవస్థలో అలర్ట్ సౌకర్యం కోసం అడగవచ్చు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అందుబాటులో ఉన్న ఈ సదుపాయాన్ని ప్రయాణికులెవరైనా వినియోగించుకోవచ్చు. ఒకసారి అలర్ట్ సౌకర్యం తీసుకుంటే… ప్రయాణికులు దిగాల్సిన స్టేషన్ రావడానికి 20 నిమిషాల ముందే వారి ఫోన్కు అలర్ట్ వస్తుంది. దాంతో… ముందుగానే మేల్కొని స్టేషన్ రాగానే దిగిపోయే అవకాశం ఉంటుంది.
‘డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం’ని సేవను పొందేందుకు… రైల్వే హెల్ప్లైన్ నెంబర్ 139కి కాల్ చేయాలి. భాషను ఎంచుకున్న తర్వాత, గమ్యస్థాన హెచ్చరిక కోసం ముందుగా నంబర్ 7ని నొక్కాలి. ఆ తర్వాత నంబర్ 2ని నొక్కి… 10 అంకెల పీఎన్ఆర్ నెంబర్ నమోదు చేయాలి. దాన్ని నిర్ధారించడానికి 1 డయల్ చేయాలి. అంతే… ఆ పీఎన్ఆర్ నెంబర్ ఉన్న మొబైల్ నెంబరుకు… ‘డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం’ సర్వీస్ యాక్టివేట్ అవుతుంది. దిగాల్సిన స్టేషన్ రావడానికి 20 నిమిషాల ముందే ప్రయాణికుల ఫోన్కు అలర్ట్ వస్తుంది.