Asaduddin Owaisi : ఢిల్లీలో ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దుండగలు దాడి చేశారు. అసదుద్దీన్ రాజస్థాన్ పర్యటనలో ఉండగా ఈ ఘటన జరిగింది. దుండగులు రాళ్లు రువ్వడంతో
ఇంటి కిటికీలు ధ్వంసమయ్యాయి. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న అసద్ ఇంటిని ఢిల్లీ డీసీపీ సందర్శించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఫోరెన్సిక్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు విచారణ చేపట్టారు. ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.
గతంలో ఢిల్లీలోని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడులు జరిగాయి. 2014 నుంచి తన ఇంటిపై ఆగంతకులు రాళ్ల దాడి చేస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటివరకు నాలుగుసార్లు దుండగులు దాడికి పాల్పడ్డారని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటిపై రాళ్లు విసిరారని అసదుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి తాను జైపూర్ నుంచి ఢిల్లీలోని ఇంటికి 11.30 గంటలకు తిరిగి వచ్చానని.. అయితే అప్పటికే రాళ్ల దాడి జరిగినట్లు పనివాళ్లు చెప్పారని వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ అసద్ డిమాండ్ చేశారు.
అసదుద్దీన్ రాజస్థాన్ లో రెండురోజులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఏడాది చివరిలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో ఆయన ఇంటిపై దాడి జరగడం కలకలం రేపుతోంది.
IPHONE: ఐఫోన్ కోసం దారుణం.. డబ్బుల్లేక డెలివరీబాయ్ హత్య
Morbi Bridge : మోర్బీ దుర్ఘటనపై సిట్ నివేదిక.. ప్రమాదానికి కారణాలివే..?