Kangana Ranaut : తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా రేంజ్లోనే కాదు.. పాన్ వరల్డ్ రేంజ్కి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే ఆయనపై ఇప్పుడు కొందరు కాంట్రవర్సీయల్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకు కారణం.. రీసెంట్గా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మతంపై తన అభిప్రాయాన్ని చెప్పటమే అందుకు కారణం. దీంతో కొందరు ఆయన్ని టార్గెట్ చేశారు. అయితే జక్కన్నపై కామెంట్స్ చేస్తున్న వారిపై కంగనా రనౌత్ ఫైర్ అయ్యింది. రాజమౌళి గొప్ప జాతీయ వాది, వర్షంలోనూ కణ కణ మండే నిప్పు కణం. ఆయనొక యోగి అంటూ అభివర్ణిస్తూ ఎవరైనా రాజమౌళిని ఏమైనా అంటే అస్సలు ఊరుకోనని రియాక్ట్ అయ్యింది.
ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుకి ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దర్శకధీరుడు ది న్యూయార్కర్ అనే పత్రికతో మాట్లాడుతూ ‘‘మాది చాలా పెద్ద కుటుంబం. అందరం మత విశ్వాసాలను నమ్ముతాం. మా కుటుంబం చూపించిన ధార్మిక మార్గంలోనే నేనూ నడిచాను. ఆధ్యాత్మిక మార్గంలో నడిచాను. సన్యాసిలా మారాను. క్రైస్తవ మతాన్ని దగ్గరిగా చూశాను. బైబిల్ చదివాను. ఇవన్నీ చేసిన తర్వాత నాకు అర్థమైందేంటంటే.. మతం అనేది స్వలాభం కోసమేనని అర్థమైంది. అప్పటి నుంచి నేను మతానికి దూరంగా ఉంటూ వస్తున్నాను. అయితే మన ఇతిహాసాలపై మాత్రం ప్రేమ తగ్గలేదు. వాటిని మత విశ్వాసాలుగా కాకుండా గొప్ప కథలుగా ఎలా మలిచారనే దాన్ని అర్థం చేసుకున్నాను’’ అన్నారు.
దీంతో కొందరు రాజమౌళికి మతంపై సదభిప్రాయం లేదంటూ ట్రోల్ చేయటం ప్రారంభించారు. అయితే బాలీవుడ్ కాట్రవర్సియల్ క్వీన్గా పేరున్న కంగనా రనౌత్ జక్కనకు బాసటగా నిలిచింది. ‘‘దేవుడు ప్రతీ చోటా ఉన్నాడు. రాజమౌళిగారి వ్యాఖ్యలపై కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. మేం అందరి కోసం సినిమాలు చేస్తుంటాం. కానీ మాపై దాడి చేస్తుంటారు. అందుకు కారణం మేం నటులు కావటమే. మాకు ఎవరి సపోర్ట్ ఉండదు. మాకు మేనే సపోర్ట్ చేసుకోవాలి. రాజమౌళిగారిని ఎవరేమన్నా ఊరుకోను. ఆయన వర్షంలో మండే నిప్పులాంటి వారు. ఒక జీనియస్. జాతీయవాది, యోగి. రాజమౌళిలాంటి వ్యక్తి మనకు ఉండటం మన అదృష్టం. రాజమౌళిపై ఏమన్నారని వివాదం క్రియేట్ చేస్తున్నారు. ఆయన బాహుబలితో మన ఖ్యాతిని పెంచారు. దేశం గర్వించేలా ఆర్ఆర్ఆర్ సినిమా చేశారు. దేశంపై ఆయనకు ఎంతో అంకిత భావం ఉంది. ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నించటానికి మీకెంత ధైర్యం కావాలి. అందరూ అందుకు సిగ్గుపడాలి’’ అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది కంగనా రనౌత్.