Viveka Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. కేసు విచారణ కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వరకూ వచ్చింది. కేసు హైదరాబాద్ కు షిఫ్ట్ చేసినప్పటి నుంచీ సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే అవినాశ్ రెడ్డిని ఓసారి సుదీర్ఘంగా విచారించింది. లేటెస్ట్ గా మారోసారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఇదే ఇప్పుడు కీలక పరిణామం.
గత నెల 28న సీబీఐ ముందు హాజరైన అవినాశ్ రెడ్డి.. అధికారులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. విచారణకు పూర్తిగా సహకరించానని మీడియాకు చెప్పారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని ఆనాడే చెప్పారు సీబీఐ. అన్నట్టుగానే మరోసారి సీబీఐ నుంచి అవినాశ్ రెడ్డికి పిలుపు వచ్చింది. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ వాట్సాప్ లో నోలీసులు పంపించారు సీబీఐ అధికారులు.
ఏమై ఉంటుంది? అవినాశ్ రెడ్డికి సీబీఐ మళ్లీ ఎందుకు పిలిచి ఉంటుంది? ఇప్పటికే ఓసారి ఆరేడు గంటల పాటు వివరాలు అడిగారుగా? మరోసారి ఆరా తీయాల్సిన విషయం ఏమై ఉంటుంది? ఇలా చర్చ జరుగుతోంది. ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? రెండోసారి పిలిచారంటే.. అందుకేనా? అనే అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.
వైఎస్ వివేకా హత్య కేసులో మొదటి నుంచీ అవినాశ్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపై ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అప్రూవర్ గా మారిన దస్తగిరి సైతం అవినాశ్ రెడ్డి పేరును వెల్లడించాడని చెబుతున్నారు. హత్య జరిగితే గుండె పోటు అని చెప్పడం, డెడ్ బాడీ దగ్గర రక్తపు మరకలు సాక్ష్యాధారాలు చెరిపేయడం.. తదితర పరిణామాలన్నీ ఎంపీ అవినాశ్ రెడ్డి సమక్షంలోనే జరిగాయనేది ప్రధాన ఆరోపణ. అందుకే, ఆయన ఈ కేసులో కీలకంగా మారారు. కడప ఎంపీ టికెట్ విషయంలో వైఎస్ వివేకా, వైఎస్ అవినాశ్ రెడ్డిల మధ్య వివాదాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అందుకే, వివేకా మర్డర్ లో అవినాశ్ రెడ్డి పాత్రపై సమగ్ర విచారణ జరుపుతోంది సీబీఐ. రెండోసారి అవినాశ్ రెడ్డిని ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. ఈ పరిణామం అధికార వైసీపీని కలవరపాటుకు గురి చేస్తోంది.