Water Problems : ఇప్పటికే మానవాళికి ప్రకృతి సిద్ధంగా లభించిన వనరులు చాలావరకు కాలుష్యానికి గురవుతున్నాయి. అవసరంగా మించి వినియోగించడం వల్ల వనరులు తర్వాత తరానికి అందే అవకాశం లేకుండా అయిపోతున్నాయి. గాలి, నీరు, భూమి.. ఇలా అన్ని కాలుష్యానికి గురవుతున్నాయి. ముఖ్యంగా తాగే నీరు అయితే ఆరోగ్యానికి హానిగా మారింది. భారతదేశంలో ఒక ప్రాంతంలో నీటి వల్ల ఊహించని సమస్యలు ఎదురవుతున్నాయి.
కేరళ రాష్ట్రం అనేది పచ్చదనానికి, పరిశుభ్రతకు మారుపేరుగా చెప్తుంటారు. కానీ అలాంటి రాష్ట్రానికి కూడా ఇప్పుడు నీటి కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా కేరళలోని కుట్టనాడ్ ప్రాంతం.. ఒకప్పుడు నీటిని నిల్వ ఉంచడానికి ఉపయోగపడేది. కానీ ఇప్పుడు అక్కడ నీటి కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. 1973లో నీటిని నిల్వ ఉంచడానికి, అక్కడి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించడానికి ఒక ప్రాజెక్ట్ ప్రారంభమయ్యింది. కానీ ఇప్పటికీ అది పూర్తవ్వకపోవడంతో అక్కడి ప్రజలకు తాగడానికి స్వచ్ఛమైన నీరు దొరకడం కష్టంగా మారింది.
కుట్టానాడ్ వాసులు నీటిని నిల్వ ఉంచడానికి పాత పద్ధతులను పాటించినా.. అవి పూర్తిస్థాయిలో వారికి న్యాయం చేయలేకపోతున్నాయి. పైప్ లైన్ల ద్వారా, ట్యాంకర్ల ద్వారా కుట్టనాడ్లోని లోతట్టు ప్రాంతాలకు నీటిని అందించడం కష్టంగా ఉంటుంది. అందుకే వాన నీటితో వారి అవసరాలను తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేరళలోని పలు ఫౌండేషన్లు వాన నీటిని నిల్వ ఉంచడానికి ప్రజలకు సాయం చేయడానికి ముందుకొస్తున్నాయి. మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి 2012 నుండి 10 వేల లీటర్ల నుండి 50 వేల లీటర్ల వరకు నీటిని నిల్వ ఉంచే ట్యాంకులు అక్కడ ఏర్పాటయ్యాయి.
ఒకప్పుడు కుట్టనాడ్లోని ప్రజలు నేరుగా నదుల నుండి, బావుల నుండి నీళ్లు తీసుకొని తాగేవారు. కానీ ఇప్పుడు నీటిలోకి విడుదలవుతున్న కెమికల్స్ వల్ల వంట చేసుకోవడానికి, తాగడానికి కూడా వారు నీటిని కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది వారిపై అధిక ఖర్చు భారాన్ని మోపుతోంది. అందుకే వాన నీటిని నిల్వ ఉంచి దానిని ఫిల్టర్ చేయడమే దీనికి పరిష్కారంగా అక్కడి పరిశోధకులు భావిస్తున్నారు. పొలాల మధ్యలో జీవనం సాగించే వారికి కూడా ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు చెప్తున్నారు.
మామూలుగా కేరళ వరద బాధిత ప్రాంతంగా పేరు తెచ్చుకుంది. అందుకే వరదలు వచ్చినప్పుడు కుట్టనాడ్లోని వాననీటిని నిల్వ ఉంచే ట్యాంకులు ధ్వంసం కాకుండా ఏర్పాట్లు జరిగాయి. కొన్నాళ్ల క్రితం వచ్చిన వరదల్లో ఈ నీరే వారికి ఉపయోగపడిందని అక్కడి ప్రజలు చెప్తున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా.. ప్రజలకు నీరు లభించేలాగా కేరళలోని సైన్స్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు.
Depression : డిప్రెషన్ను గుర్తించే కత్రిమ మేధస్సు..
Changes in Space : నక్షత్రాల ఏర్పాటుతో అంతరిక్షంలో మార్పులు..