Taraka Ratna: తారకరత్న. 23 రోజులుగా హాస్పిటల్ లోనే ఉన్నారు. మెరుగైన చికిత్స అందిస్తున్నా ఆయన కోలుకోవడం లేదు. అప్పటికీ ఇప్పటికీ పెద్దగా మార్పేమి లేదంటున్నారు. విదేశాల నుంచి వైద్యులను పిలిపించారు. వారి సూచనలతో బెంగళూరు నారాయణ హృదయాలయలో ట్రీట్మెంట్ చేస్తున్నారు. చికిత్సకు ఆయన శరీరం అంతగా స్పందించడం లేదని తెలుస్తోంది.
బెయిన్ తోనే మేజర్ ప్రాబ్లమ్. హార్ట్ స్ట్రోక్ వచ్చాక.. చాలాసేపటి వరకూ బ్లడ్ పంపింగ్ ఆగిపోయింది. బ్రెయిన్ కు రక్తం నిలిచి.. మెదడు పని తీరు దెబ్బతింది. దీంతో కోమాలోకి వెళ్లిపోయారు తారకరత్న. అందుకే, ప్రధానంగా బ్రెయిన్ కి సంబంధించిన చికిత్సలే చేస్తున్నారు వైద్యులు.
గురువారం తారకరత్నకు ఎం.ఆర్.ఐ స్కానింగ్ చేశారు వైద్యులు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. మెదడుకు సంబంధించిన వైద్య సేవలు కొనసాగించారు. అయితే, శనివారం కల్లా తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది.
విషయం తెలిసి నందమూరి బాలకృష్ణ బెంగళూరు వెళ్లారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో మాట్లాడారు. తారకరత్న కుటుంబ సభ్యులు సైతం ఆసుపత్రిలోనే ఉన్నారు. వారిలో అలజడి పెరిగింది.