Air India : భారత ప్రభుత్వం నుంచి ఎయిరిండియా టాటాల చేతుల్లోకి వచ్చాక… ఒకేసారి 840 కొత్త విమానాల కోసం ఆర్డర్ ఇవ్వడం… ప్రపంచ విమానయాన రంగంలోనే సంచలనం సృష్టించింది. ఈ భారీ డీల్ చూసి… విమానయాన రంగం మొత్తం నోరెళ్లబెట్టింది. అయితే… ఎయిరిండియా మాదిరే ఇతర విమానయాన సంస్థలు కూడా కొత్త విమానాల కోసం త్వరలో భారీ ఆర్డర్ ఇవ్వబోతున్నాయనే వార్త… మరింత సంచలనం సృష్టిస్తోంది.
ఎయిరిండియా మినహా దేశంలోని ఇతర విమానయాన సంస్థలన్నీ వచ్చే రెండేళ్లలో మొత్తం 1200 కొత్త విమానాల కోసం ఆర్డర్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయని సమాచారం. సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ ఇండియా-CAPAI ప్రకారం… ఇండిగో సహా మిగతా విమానయాన సంస్థలు కొత్త విమానాలు సమకూర్చుకోవాలని భావిస్తున్నాయి. ఫ్లీట్ రీప్లేస్మెంట్, అభివృద్ధి ప్రణాళికలో భాగంగా… వచ్చే రెండేళ్లలోనే వీలైనన్ని కొత్త ఎయిర్క్రాఫ్ట్ సర్వీసులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. కరోనా కన్నా ముందే 300 కొత్త విమానాల కోసం ఆర్డర్ ఇవ్వాలని ఇండిగో భావించినా… మహమ్మారి కారణంగా చాలా రోజుల పాటు కార్యకలాపాలు స్తంభించడంతో… ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఇప్పుడు మళ్లీ పరిస్థితులన్నీ కుదుటపడటంతో… మొత్తం 500 కొత్త విమానాల కోసం ఆర్డర్ ఇవ్వాలని ఇండిగో భావిస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే, విమానయాన సంస్థలు ఇలా ఆర్డర్ ఇచ్చిన వెంటనే అలా కొత్త విమానాలు ఎగిరి వస్తాయనే గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే… గత డిసెంబర్ 31 నాటికే ఎయిర్బస్, బోయింగ్ సంస్థల దగ్గర 12,669 కొత్త విమానాల ఆర్డర్లు పెండింగ్ లో ఉన్నాయి. సప్లై చైన్ సమస్యల కారణంగా తగినన్ని ఇంజిన్లు అందుబాటులో లేకపోవడంతో… ఎయిర్ఫ్రేమ్ సిద్ధంగా ఉన్నా విమానాలు డెలివరీ చేయలేని పరిస్థితి ఉంది. వచ్చే ఏడాది మార్చి చివరికల్లా సమస్యలన్నీ తొలగిపోయి… కొత్త విమానాల డెలివరీ ఊపందుకోవచ్చని భావిస్తున్నారు. అయినా… ఇప్పుడున్న ఆర్డర్ల మేరకు కొత్త విమానాలన్నీ డెలివరీ చేయాలంటే మరో ఆరేళ్లు పడుతుందని భావిస్తున్నారు.