Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ప్రెస్. దేశంలో ఇప్పుడు ట్రెండింగ్ రైలు. సూపర్ ఫాస్ట్ గా వెళ్తుంది. లగ్జరీ వసతులు ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే విమాన ప్రయాణం మాదిరి ఉంటుంది. అలాంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతోంది. సికింద్రాబాద్, విశాఖల మధ్య సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. లేటెస్ట్ గా తిరుమల వెంకన్న పాదాల చెంతకూ వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు పెట్టనుంది. ఆ మేరకు రైల్వే అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.
ఏ రూట్ లో వందే భారత్ రైలు నడపాలనేదే కీలకంగా మారనుంది. ఆ దిశగా ప్రయాణ మార్గాలను అన్వేషిస్తున్నారు. రైల్వే శాఖ మూడు మార్గాలపై సర్వే నిర్వహిస్తోంది.
రూట్ 1: బీబీనగర్, నడికుడి, మిర్యాలగూడ మీదుగా..
రూట్ 2: వరంగల్, ఖాజీపేట, కడప మీదుగా..
రూట్ 3: బీబీనగర్ నుంచి గుంటూరు, నెల్లూరు, గూడూరు మీదుగా..
ఈ మూడు రూట్ ఆప్షన్లతో పాటు పిడుగురాళ్ల జంక్షన్ నుంచి శావల్యపురం మీదుగా ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా సర్వే జరిపారు.
రైల్వే శాఖ ముందున్న ఈ ప్రత్యామ్నాయాల్లో.. తక్కువ దూరం ఉన్న మార్గానికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ట్రాక్ల పటిష్ఠత, వంతెన నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మార్గాన్ని ఖరారు చేయనున్నారు అధికారులు.
మామూలు రైళ్లలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సుమారు 12 గంటలు పడుతుంది. అదే, వందేభారత్ ఎక్స్ ప్రెస్ అయితే.. ఆ రైలు ప్రయాణం సగానికి తగ్గిపోతుంది. అంటే, 6-7 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చేరుకోవచ్చు. తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎంతో ఉపయుక్తం కానుంది. ప్రయాణికులు ఆదరణ కూడా భారీగా ఉండే అవకాశం ఉంది.
ఫిబ్రవరి నెలాఖరులోగా సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. టికెట్ ధర సుమారు రూ.1200 ఉండొచ్చని అంటున్నారు.