Chandrababu: చంద్రబాబు అనపర్తి పర్యటన రచ్చ రంభోలాగా మారడం రాజకీయంగా కలకలం రేపుతోంది. టీడీపీ అధినేతకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు పోలీసులు. ముందురోజు సభకు పర్మిషన్ ఇచ్చి.. మీటింగ్ టైమ్ కి అనుమతి లేదంటూ కిరికిరి స్టార్ట్ చేశారు. చంద్రబాబు అనపర్తికి వెళ్లకుండా బలభద్రాపురంలోనే అడ్డగించారు. బాబు కాన్వాయ్ కి వాహనం అడ్డుపెట్టడం.. పోలీసులు రోడ్డుపై బైఠాయించడం.. అబ్బో చాలానే చేశారు. చంద్రబాబు సైతం తగ్గేదేలే అంటూ.. 7 కిలోమీటర్లు నడిచి మరీ అనపర్తి వెళ్లారు. అక్కడ సభలో మాట్లాడుతుండగా.. లైట్స్ హాఫ్ చేసి మరోసారి ఇబ్బంది పెట్టారు. కార్యకర్తల సెల్ ఫోన్ వెలుగుల్లో.. చంద్రబాబు ప్రసంగం పూర్తి చేశారు. ఈ టోటల్ ఎపిసోడ్ లో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య ఓ చిన్నస్థాయి యుద్ధమే జరిగింది. పోలీసుల దాడిలో పలువురు నాయకులు తీవ్రంగా గాయపడ్డారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పోలీసుల దాడిలో గాయపడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తలను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. అక్రమ కేసులపై న్యాయబద్ధంగా పోరాడుదామని ధైర్యం చెప్పారు. కార్యకర్తలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పోలీసులు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని గమనించే వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రతిపక్షాలు నిర్వహించే సభలను అడ్డుకోవాలి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందంటూ దుయ్యబట్టారు. చట్టవ్యతిరేకంగా పనిచేయాలని పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనే కొంతమంది పోలీసులు అరాచకం సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కావాలనే టీడీపీ కార్యకర్తలపై గురిపెట్టి దాడి చేశారని.. పోలీసులు చట్టానికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలని.. లేదంటే అధికారంలోకి వచ్చాక సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.