Shiv Sena: ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చంద్రబాబు నాయకత్వంలో మెజార్టీ ఎమ్మెల్యేలు జట్టు కట్టారు. ఓ హోటల్ లో మకాం వేశారు. ఎన్టీఆర్ ఆ హోటల్ ముందు ధర్నా చేస్తే.. ఆయనపై కొందరు చెప్పులు విసిరారు. పార్టీ పెట్టింది ఎన్టీఆరే, ఎన్నికల్లో గెలిచిందీ ఎన్టీఆరే.. కానీ, ఎమ్మెల్యేలంతా చంద్రబాబుకు జై కొట్టడంతో ఇటు ప్రభుత్వం, అటు పార్టీ చంద్రబాబు వశం అయింది. మెజార్టీ బేస్డ్ గా తెలుగుదేశం పార్టీ పేరును, సైకిల్ గుర్తును చంద్రబాబుకే కేటాయించింది ఎన్నికల సంఘం. ఇదంతా 1995లో ఏపీలో జరిగిన పొలిటికల్ మేటర్.
సేమ్ టు సేమ్.. మహారాష్ట్రలోనూ అదే జరిగింది. శివసేన రెండుగా చీలింది. షిండే నాయకత్వంలో మెజార్టీ ఎమ్మెల్యేలు.. ఉద్దవ్ థాక్రేను సీఎం సీటు నుంచి దించేశారు. ఓ వర్గంగా ఏర్పడి.. బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. శివసేన పార్టీ కోసం షిండే, థాక్రే వర్గాలు పోటీ పడ్డాయి. పార్టీ మాదంటే మాదంటూ ప్రకటనలు ఇచ్చాయి.
కట్ చేస్తే, ఇష్యూ ఎన్నికల కమిషన్ దగ్గరకు చేరింది. మెజార్టీ సభ్యులు షిండే నాయకత్వానికే జై కొట్టడంతో.. రూల్స్ ప్రకారం శివసేన పార్టీని షిండే వర్గానికే కేటాయిస్తూ నిర్ణయం వెల్లడించింది ఈసీ. శివసేన పేరును, పార్టీ గుర్తు అయిన విల్లు, బాణంను షిండే అండ్ కో కు కేటాయించింది ఎన్నికల కమిషన్. దీంతో, తన తండ్రి స్థాపించిన పార్టీ ఉద్దవ్ థాక్రే చేజారిపోయింది. ఇప్పుడిక మరో కొత్త పార్టీ, కొత్త పేరు పెట్టుకోవాల్సిందే.
అప్పుడు ఏపీ-టీడీపీ.. ఇప్పుడు మహారాష్ట్ర-శివసేన.. రెండు ఘటనల్లోనూ ఒకేరకమైన ఫలితం వచ్చింది. అందుకే, శివసేన ఇష్యూపై ఏపీలోనూ చర్చ నడుస్తోంది. ఆనాటి ఎన్టీఆర్-చంద్రబాబు టాపిక్ మరోసారి గుర్తుకు వస్తోంది.