Snow Accidents : పలు ఫారిన్ దేశాల్లోనే కాదు.. చలికాలం వస్తే చాలు.. ఇండియాలోని రోడ్లను కూడా మంచు కమ్మేస్తుంది. ఈ మంచు వల్ల దారులు సరిగా కనపడకపోవడం ఎన్నో ప్రమాదాలకు కూడా దారితీస్తుంది. నార్త్ ఇండియాలోని కొన్ని ప్రదేశాల్లో రోడ్డు అంతా మంచుతో నిండిపోయి వాహనాలు కదలడం కూడా కష్టమయిపోతుంది. అలాంటి పరిస్థితులను అదుపు చేయడానికి పరిశోధకులు ఓ కొత్త మార్గాన్ని కనుక్కున్నారు.
మంచులో కాలు పెట్టినా.. లేదా వాహనాలతో వెళ్లాలనుకున్నా.. స్లిప్ అవ్వడం ఖాయం. అందుకే అలాంటి ప్రదేశాల్లో ప్రయాణిస్తున్నప్పుడు పలు జాగ్రత్తలు వహిస్తారు. ఎన్ని జాగ్రత్తలు వహించినా.. ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. అయితే మంచును తొందరగా కరిగించడానికి ఉప్పు, ఇసుకను కలిపి ఉపయోగించవచ్చు. కానీ అవి ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తే.. పర్యావరణానికి నష్టం జరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా వీటిని ఉపయోగించే సమయంలో మంచు తుఫాను లాంటిది వస్తే.. పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది.
పర్యావరణానికి నష్టం జరగకుండా.. మంచు వల్ల రోడ్లు జారకుండా ఉండడానికి పరిశోధకులు ఓ కొత్త మార్గాన్ని కనుక్కున్నారు. క్లోరైడ్ లేని ఉప్పుతో మైక్రోక్యాప్సూల్స్ను తయారు చేసి రోడ్లు వేసే సమయంలోనే దాని మిక్షర్లో కలిపితే.. రోడ్లపై మంచు నిలవ ఉండకుండా కరిగిపోతుందని వారు పరిశోధనల్లో గమనించారు. ఎప్పటికప్పుడు రోడ్డుపై నిలిచిపోతున్న మంచును తొలగించడం కష్టం కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా మంచు నిలబడకుండా చేయడమే మేలు అని వారు భావిస్తున్నారు.
మామూలుగా మంచు రోడ్డుపై నిలిచిపోయినప్పుడు దానిని పరికరాలతో తొలగిస్తారు. కానీ ఈ ప్రక్రియ కోసం ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా లేబర్ పవర్ కూడా ఎక్కువగా కావాల్సి ఉంటుంది. అలా కాకుండా రోడ్డును కొత్త టెక్నాలజీస్ ఉపయోగించి వేయడం కూడా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఈ మైక్రోక్యాప్సూల్స్ ఐడియా మంచు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎంతో ఉపయోగపడుతుందని, అంతే కాకుండా మంచు వల్ల ఏర్పడుతున్న ప్రమాదాలను తగ్గిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.