Adani: అదానీ-హిండెన్బర్గ్ ఎపిసోడ్ దేశాన్ని కుదిపేస్తోంది. స్టాక్ మార్కెట్లను షేక్ చేస్తోంది. 10 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. ప్రపంచ వీధుల్లో దేశం పరవు పోయింది. ఎంత డ్యామేజ్ చేయాలో.. అంతకంటే ఎక్కువే నష్టం చేకూర్చింది అదానీ యవ్వారం. అదానీకి మోదీ సపోర్ట్ ఉందని.. కేంద్రం దన్ను వల్లే అదానీ ఇంతటి అరాచకాలు చేయగలిగిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ విషయంలో న్యాయం చేయాలంటూ కొందరు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. విచారణ సందర్భంగా సుప్రీం త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
అదానీ-హిండెన్బర్గ్ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విషయంలో నిజానిజాలు తేల్చేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
ఇటు పిటిషనర్ల నుంచి కానీ, అటు ప్రభుత్వం నుంచి కానీ ఎవరి పేర్లను, సూచనలు, సలహాలు తీసుకోబోమని స్పష్టం చేసింది.
కేంద్రం ఇచ్చిన సీల్డ్ కవర్ సూచనలను అంగీకరించబోమని సుప్రీంకోర్టు వెల్లడించింది. పూర్తి పారదర్శకత ఉండాలని కోరుకుంటున్నామని తెలిపింది.
అదానీ వ్యవహారంపై దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణను ముగించి తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం.. తామే ఒక నిపుణుల కమిటీని నియమిస్తామని ప్రకటించింది.