IND Vs AUG : ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత్ బౌలర్లు చెలరేగారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఆసీస్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. మాట్ రెన్షా స్థానంలో ట్రావిస్ హెడ్, స్కాట్ బోల్యాండ్ ప్లేస్ లో మథ్యూ కునెమన్ తీసుకుంది. మథ్యూ ఈ మ్యాచ్ ద్వారా టెస్టు అరంగేట్రం చేశాడు. నయా వాల్ ఛతేశ్వర్ పుజారాకు ఇది వందో టెస్టు మ్యాచ్ . ఈ మ్యాచ్ లో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చేతులమీదుగా పుజారా క్యాప్ అందుకున్నాడు.
ఆసీస్ బ్యాటర్లకు భారత్ బౌలర్లు తొలిరోజు పట్టపగలే చుక్కలు చూపించారు. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ ఆసీస్ కు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్ కు 50 పరుగులు జోడించిన తర్వాత వార్నర్ (15) ను షమీ అవుట్ చేశాడు. ఆసీస్ స్కోర్ 91 పరుగుల వద్ద మార్నస్ లుబుషేన్ ( 18) ను అశ్విన్ పెవిలియన్ కు చేర్చాడు. అదే స్కోర్ వద్ద ఆస్ట్రేలియా మరో వికెట్ ను కోల్పోయింది. స్టార్ బ్యాటర్ స్టివ్ స్మిత్ అశ్విన్ బౌలింగ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. కాసేపటికే టావిస్ హెడ్ వికెట్ ను కంగారు జట్టు కోల్పోయింది. హెడ్ ను షమీ బోల్తా కొట్టించాడు. దీంతో ఆస్ట్రేలియా 17 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు స్కోర్ 108 పరుగులకే మొత్తం 4 వికెట్లు పడ్డాయి.
మరోవైపు ఓపెనర్ ఖవాజా అద్భుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పీటర్ హ్యాండ్ కాంబ్ తో కలిసి 5 వికెట్ కు 59 పరుగులు జోడించాడు. ఖవాజా (81), అలెక్స్ క్యారీ (డకౌట్) ఒక్క పరుగు తేడాతో అవుట్ కావడంతో ఆస్ట్రేలియా 168 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఉస్మాన్ ఖవాజాను అవుట్ చేయడం ద్వారా జడేజా టెస్టుల్లో 250 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. క్యారీని అశ్విన్ బోల్తా కొట్టించాడు. ఈ దశలో కెప్టెన్ పాట్ కమిన్స్(33) , హ్యాండ్ కాంబ్ (72*) భారత్ బౌలర్లును కాసేపు అడ్డుకున్నారు. ఏడో వికెట్ కు 59 పరుగులు జోడించిన తర్వాత కమిన్స్ , మర్ఫీ (0 ) ను జడేజా ఓకే ఓవర్ లో అవుట్ చేశాడు. ఆ తర్వాత నాథన్ లయన్(10)ను షమీ క్లిన్ బౌల్డ్ చేశాడు.
భారత్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు ,మహమ్మద్ షమీ 4 వికెట్లు, జడేజా 3 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా ఆటముగిసే సమయానికి 263 పరుగులకు ఆలౌట్ అయింది.