Mahasena Rajesh : వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన మహాసేన రాజేష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో దళిత సామాజికవర్గంతో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. మహాసేన రాజేష్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీలో చేరిన సమయంలో మహాసేన రాజేష్ వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా తీవ్ర విమర్శలు చేశారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును దళిత ద్రోహిగా సీఎం జగన్ చిత్రీకరించారని తెలిపారు. జగన్ మాటలు నమ్మి చంద్రబాబును అపార్థం చేసుకున్నామని చెప్పారు. నిజమైన దళిత ద్రోహి జగనేనని విమర్శించారు. ఎస్సీలకు చంద్రబాబు 27 సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం ఆ పథకాలను రద్దు చేసిందన్నారు. 2019లో టీడీపీ గెలిచి ఉంటే అమరావతి నిర్మాణం పూర్తయ్యేదన్నారు. దళితులు ఎవరి కాళ్లమీద వారు నిలబడేలా చంద్రబాబు చేశారని చెప్పారు. చీకటి వచ్చాకే వెలుగు విలువ తెలుస్తుందన్నారు. జగన్ తుగ్లక్ పాలన చూశాక చంద్రబాబు పాలన రామరాజ్యం అని అర్థమవుతోందని మహాసేన రాజేష్ అన్నారు.
మహాసేన రాజేష్ కొంతకాలంగా ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అదే సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను సపోర్ట్ చేస్తూ చాలా వీడియోలు చేశారు. దీంతో అటు టీడీపీ, ఇటు జనసేన సానుభూతిపరుల నుంచి రాజేష్ కు బాగా మద్దతు లభించింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులు రాజేష్ కు బాగా ఫాలో అవుతున్నారు.
ఇటీవల రాజమండ్రిలో రాజేష్ కారుపై దాడి జరిగింది. ఈ దాడిని టీడీపీ, జనసేన నేతలు ఖండించారు. వైసీపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మరోవైపు మహాసేన రాజేష్ జనసేనలో చేరతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత టీడీపీలోకి వెళుతున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజేష్ సైకిల్ ఎక్కారు. మరి జనసేనలోకి ఎందుకు చేరలేదన్నదే ప్రశ్న.