Twitter: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేశాక ఆ సంస్థ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. వాణిజ్య ప్రకటనలు తగ్గిపోవడంతో సంస్థ నష్టాల్లోకి జారుకుంది. ఈక్రమంలో ట్విట్టర్ను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు మస్క్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. కొత్త కొత్త ప్లాన్లను అమలు చేస్తున్నాడు.
ఇప్పటికే ట్విట్టర్లోని 50 శాతం మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపాడు. అలాగే కొత్తగా ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ను తీసుకొచ్చాడు. ట్విట్టర్కు సంబంధించిన అనేక విలువైన ఆస్తులను వేలం వేశాడు. భారత్లో ఉన్న తమ ఉద్యోగుల్లో దాదాపు 90 శాతం మందిని తొలగించాడు.
ఈక్రమంలో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడంతో భారత్లో ఉన్న మూడు ఆఫీసుల్లో రెండింటిని మూసివేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబైలో ఉన్న ఆఫీసులను మూసి వేసి అందులో పనిచేస్తున్న సిబ్బందికి శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చినట్లు సమాచారం. అలాగే బెంగళూరులో ఉన్న ఆఫీసులో మాత్రం యాదావిధిగా సేవలు కొనసాగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.