Lord Shiva : పరమశివుడికి ఎన్నో పేర్లు ఉన్నా..నీలకంఠుడు అని పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. దేవతలకు.. అసురులకు పోటాపోటీ మధ్య రెండు వర్గాలు కలసి అమృతం కోసం క్షీరసాగర మథనం జరిపారు, అలా జరిపిన సమయంలోనే ముందు గరళం వచ్చింది. సముద్రం నుంచి పుట్టిన హాలహలం చూసి అందరూ పారిపోగా జగత్తును రక్షించేందుకు శివుడు ఆ పాపాన్ని తానే భరించాడు. విషం మింగిన గరళకంఠుడు జీవచరాలను రక్షించాడు. . గరళం శివునిలో విపరీతమైన వేడిని, తాపాన్ని పుట్టించడం ప్రారంభించింది. దానిని తట్టుకోవడం కోసం నిత్యం ఈశ్వరుడు శిరమున దాల్చిన అర్ధ చంద్రుడు జీవకోటికి చల్లదనాన్ని ప్రసాదించాడు.
అయితే శివుడు మింగిన గరళం శరీరంలోకి వెళ్లకుండా పార్వతిదేవి శివుని కంఠంలో విషాన్ని ఆపేసింది. అప్పుడు శివయ్య కంఠం నీలం రంగులోకి మారిపోయింది. దీంతో అప్పుడే శివుడు నీలకంఠుడుగా మారాడు. శివుడు మింగిన గరళం గొంతులోనే ఉండాలి.. శివుడు పడుకున్న ఆ గరళం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉంది అని.. శివుడుకు నిద్ర రాకుండా దేవతలు.. అసురులు అందరూ కలిసి ఐదు జాముల కాలం ఏకధాటిగా ఆడిపాడారు. ఆ రోజే మాఘ బహుళ చతుర్దశి. వారు ఆడిపాడిన ఐదు జాముల కాలాన్ని ‘మహాశివరాత్రి’ అని పిలుస్తారు. ఇక ఆ రోజు నుండి శివ భక్తులు శివుడు కోసం ఉపవాసం, జాగారణతో శివారాధన చేస్తున్నారు. శివపార్వతుల కళ్యాణం, శివలింగోద్భవం కూడా జరిగింది. అప్పటి నుంచి శివుడును నీలకంఠుడుగా పిలవడం ప్రారంభించారు.
చాలా వరకూ శివుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. కొన్ని చోట్ల మాత్రం మానవ రూపంలో విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం కూడా కూర్చొని లేదా నిలబడిన రూపంలో మనకు కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లోని పళ్లి కొండేశ్వర క్షేత్రంలో శివుడు పార్వతి ఒడిలో పడుకున్న రూపంలో కనిపిస్తాడు. దేశంలో ఇటువంటి విగ్రహం ఇదొక్కటే. ఈ క్షేత్రాన్ని సూరుటుపళ్లి అని కూడా అంటారు. చుట్టూ పచ్చని చెట్లు, సెలయేటి గలగల మధ్య ఈ క్షేత్ర దర్శనం ఆహ్లాదాన్ని పంచుతుంది.