Climate Change : గ్లోబల్ వార్మింగ్ అనేది ఇప్పటికే భూగ్రహ ఉష్ణోగ్రతపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వాతావరణంలో మార్పులు మానవాళికి ఎంతో ఇబ్బందులను కలిగిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ను అదుపు చేయడానికి ఇప్పటికే శాస్త్రవేత్తలు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ అనేది తక్కువ చేయలేకపోయినా.. కనీసం పెరగకుండా చూసుకోవాలని వారు టార్గెట్గా పెట్టుకున్నారు. వాతావరణ మార్పులు మరో విపత్తుకు కూడా దారితీయవచ్చని తాజాగా పరిశోధనల్లో తేలింది.
వాతావరణంలో మార్పులు ప్రపంచవ్యాప్తంగా నీటి సమస్యకు దారితీస్తాయని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. ఇప్పటికే నీటిని పరిశుభ్రంగా ఉంచడానికి, స్వచ్ఛమైన నీటిని అందరికీ అందించడానికి ఎన్నో ప్రాజెక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ 2050 వరకు 5 బిలియన్ ప్రజలు నీటి సమస్యకు గురవుతున్నారని అమెరికా చేసిన పరిశోధనల్లో తేలింది. నీటి పరిరక్షణకు, వాతావరణ మార్పులకు సంబంధం ఉంటుందని ఎక్కువశాతం ఎవరికీ తెలియదని పరిశోధకులు చెప్తున్నారు.
కేవలం తాగే నీరు పరిశుభ్రంగా ఉన్నాయా లేవా అన్నంత వరకే ప్రజల ఆలోచన ఆగిపోయిందని.. కానీ వాతావరణ మార్పుల వల్ల నీటి కొరత కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులు, నీటి సంరక్షణ లాంటి అంశాలు ఒకటిపై ఒకటి ప్రభావం చూపిస్తాయని వారు అంటున్నారు. ఇప్పటికే వారు చేసిన పలు స్టడీలలో ఈ విషయం బయటపడిందని అన్నారు. కానీ నీటి కొరత మార్పులను గుర్తించినంత సులభంగా వాతావరణ మార్పులను మానవాళి తెలుసుకోలేకపోతుందని వాపోతున్నారు.
ఇప్పటికే పూర్తి భూభాగంపై నీటి కొరత గురించి, నీటి సంరక్షణ గురించి జరిగిన పరిశోధనలు చాలా తక్కువ. ప్రపంచ దేశాలలో ఎవరికి వారు నీటి గురించి గొడవపడి విభేదాలు తెచ్చుకోవడం వల్ల అన్ని దేశాల శాస్త్రవేత్తలు కలిసి పరిశోధనలు చేసే అవకాశం ఇప్పటివరకు రాలేదు. అది కూడా నీటి సంరక్షణ లోపానికి మరో కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పలు దేశాల శాస్త్రవేత్తలు.. ఇప్పటివరకు తాము వాతావరణ మార్పుల గురించే ఆలోచించామని, నీటి సంరక్షణ అంశంలో కూడా లోపాలు ఉంటే అది మానవాళికి హానికారమని అంటున్నారు.
ఇప్పటికే భూమిపై జరిగే చాలావరకు వాతావరణ మార్పులకు మానవాళే కారణం. అలాగే నీటి పారిశుధ్యానికి కూడా వారే కారణమని తెలుస్తోంది. అందుకే ఇప్పటినుండే మనుషులు.. వారు చేసే తప్పులను గ్రహించి వాతావరణాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తే.. నీటిని, వాతావరణాన్ని కాపాడుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి మెరుగు అవ్వడానికి కమ్యూనికేషనే ముఖ్యమని వారు భావిస్తున్నారు.