Afghanistan: అఫ్గానిస్తాన్పై దండెత్తి.. ఆ దేశాన్ని చేతుల్లోకి తీసుకున్న తాలిబాన్లు.. పరిపాలన విషయంలో తడబడుతున్నారు. రోజుకో కొత్త రూల్ తెస్తున్నారు. పాలనలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇతరదేశాలను కలుపుకొని పోవాల్సిన చోట తెలివి తక్కువ నిర్ణయాలతో ఒంటరవుతున్నారు.వీటికి తోడు ఇప్పుడు తాలిబాన్ లీడర్ల మధ్య ఫైటింగ్ కొనసాగుతోంది. హక్కానీ గ్రూప్ సీనియర్ లీడర్ సిరాజుద్దీన్ హక్కానీ, తాలిబన్ సుప్రీం లీడర్ హైదాతుల్లా మధ్య గొడవలు బాహాటంగానే జరుగుతున్నాయి. హైదాతుల్లా ఒక్కడే అధికారాలను అనుభవిస్తున్నాడని సిరాజుద్దీన్ బహిరంగంగానే ఫైర్ అవుతున్నారు. ఇటీవలే మత పెద్ద సమావేశంలో పాలన వ్యవస్థ పరువు తీస్తున్నారని, దీన్ని చూస్తూ సహించే పరిస్థితి లేదన్నారు హక్కానీ. ఇక ఏ మాత్రం సహించబోమని, పాలన వ్యవస్థకు ప్రజలకు మధ్య చీలికలు తెచ్చే విధానాలు ఆపాలంటూ ఫైర్ అవుతున్నారు.
అలా హక్కానీ రివర్స్ లో రాగానే… తాలిబాన్ ప్రతినిధి కామెంట్స్ చేశారు. హక్కానీ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఇస్లాం పద్ధతుల ప్రకారం.. బహిరంగంగా అఖుంద్జాద లేదా మంత్రి, ప్రభుత్వ అధికారులను విమర్శించకూడదని, ఏదైనా ఉంటే నేరుగా ఆయన్ను కలిసి అభ్యంతరాలు చెప్పుకోవాలంటున్నారు. ఇక అఫ్గాన్ న్యాయశాఖ మంత్రి అబ్దుల్ ఘనీ ఫయిక్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇస్లామిక్ ఎమిరేట్లో మంత్రి పదవిలో ఉండి.. అదే ఎమిరేట్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తాడా… ఎన్ని గుండెలు అంటూ మీడియా ముందే తన అసంతృప్తి వెళ్లగక్కారు.
మరోవైపు అఫ్గాన్ సుప్రీం లీడర్ హైదాతుల్లా అఖుంద్జాద పాలన తీరు రోజురోజుకూ కాంట్రోవర్సీ అవుతోంది. మహిళలు చాలా చోట్ల పనిచేయడాన్ని నిషేధించారు. వారిని ఎడ్యుకేషన్ కు దూరం చేశారు. అయితే ఈ నిర్ణయాలను అఖుంద్జాద సమర్థించుకొన్నారు. అంతేకాదు మహిళలు ఒంటరిగా 70 కిలోమీటర్లకు మించి ప్రయాణించడంపై బ్యాన్ కూడా ఉంది. అయితే ఇవేం తెలివి తక్కువ నిర్ణయాలంటూ… తాలిబన్లతో సన్నిహితంగా ఉంటున్న దేశాలు కూడా వ్యతిరేకించాయి. హక్కానీ వర్గం మాత్రం బాలిక విద్యపై నిషేధం ఎత్తివేయాలని కోరుతున్నారు.
ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజలు పాత గాయాల నుంచి కోలుకొనేట్లు చేయాలంటూ సిరాజుద్దీన్ హక్కానీ కామెంట్స్ చేస్తున్నారు. అంటే పాలనా విషయాలపై చెరో దృవం అన్నట్లుగా పరిస్థితి ఉంది. మరో వైపు తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా యాకూబ్ కూడా మహిళలకు హక్కుల విషయంలో సానుకూలంగా కనిపిస్తున్నారు. వారికి హక్కులు ఉన్నప్పుడే అంతర్జాతీయంగా అఫ్గాన్ ఏకాకిగా మారకుండా ఉంటుందంటున్నారు.
మెజార్టీల మాట వినని అతివాద నాయకులు తాలిబన్ పాలనకు తలనొప్పిగా మారారని నిపుణులు అంటున్నారు. తాలిబన్లలో ఛాందసవాదులు ఎక్కువ అధికారాలను దక్కించుకొన్నారు. అయితే వారి సంఖ్య తక్కువగా ఉంది. వీరి నిర్ణయాలతోనే సమస్యలు పెరుగుతున్నాయంటున్నారు. అఫ్గాన్ లో తాలిబన్ల మధ్య విభేదాలు ముదిరితే అంతర్యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు. చాలా మంది తాలిబన్ లీడర్లకు ప్రైవేట్ ఆర్మీ ఉంది. సిరాజుద్దీన్ హక్కానీ చేతిలో కూడా పవర్ ఫుల్ హక్కానీ నెట్వర్క్ ఉంది. మరోవైపు ముల్లా యాకూబ్ వద్ద ముల్లా ఒమర్ సేనలు ఉన్నాయి. అమెరికా వదిలేసి వెళ్లిన ఆయుధాల్లో చాలా వరకు వీరి ఆధీనంలో ఉన్నాయి. ఇక సుప్రీం లీడర్ అఖుంద్జాద చేతిలో మాత్రం కాందహార్లోని స్థానిక మిలిటెంట్లు ఉన్నారు. దీంతోపాటు అతివాద దళాలు కూడా ఆయన మాటే వింటాయి.
2021లో అధికారం దక్కించుకొన్న టైంలో మంత్రి వర్గం ఏర్పాటు, అఫ్గాన్ లో తాలిబన్ల విక్టరీపై క్రెడిట్ ఎవరికి దక్కాలనే విషయంపైనా గతంలో చాలా గొడవలు జరిగాయి. తమ దౌత్యం వల్లే అమెరికన్లు వెళ్లిపోయారని బరాదర్ అంటే… తాము యుద్ధం చేయడంతోనే అమెరికన్లు పారిపోయారని హక్కానీ ఫాలోవర్స్ వాదించారు. ఈ టైంలో ఇద్దరు నాయకుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఇది చూసిన వారి అనుచరులు తన్నుకున్నారు. దీంతో క్యాబినెట్ కూర్పుపై అలిగిన బరాదర్ అప్పట్లో కాందహార్ వెళ్లి సుప్రీం లీడర్ ముల్లా అఖుంద్జాదాతో భేటీ అయ్యారు. కొన్ని రోజులు కనిపించకుండా పోయారు.
తాలిబన్లలోని సిరాజుద్దీన్ హక్కానీ వర్గం, ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా యాకూబ్లను పాకిస్థాన్ చేరదీసింది. వీరిద్దరూ పాక్కు మద్దతుదారులు. పాక్ సైన్యం, ఐఎస్ఐ వీరికి కీలక సహకారం అందించింది. తాజాగా తాలిబన్లు పాక్పై దాడులు చేస్తున్నారు. ఈ సమయంలో సిరాజుద్దీన్ ఏకంగా సుప్రీం లీడర్ను టార్గెట్ గా చేసుకుని విమర్శించడం చర్చనీయాంశమైంది. ఇది ఎక్కడివరకైనా దారి తీసే ఛాన్స్ ఉందంటున్నారు. లోపల ఒకటి, బయటకు మరోలా అఫ్గాన్ వాతావరణం కనిపిస్తోంది.