SAMANTHA: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. స్టార్ హీరోయిన్ సమంత. ఇటీవల సామ్ నటించిన ‘యశోద’ సినిమా రిలీజ్ కాగా.. గుణశేఖర్ దర్శకత్వంతో నటించిన ‘శాకుంతలం’ మూవీ రిలీజ్కు సిద్ధంగా ఉంది. పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, భూమిక జంటగా వచ్చిన ‘ఖుషి’ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ మూవీ పేరుతోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత కలిసి ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. మరోవైపు వరుణ్ ధావన్తో కలిసి ‘సిటాడెల్’ అనే వెబ్సిరీస్లోనూ నటిస్తోంది.
ఒక వైపు మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే మరోవైపు వరుస సినిమాలతో దూసుకెళ్తోంది..సామ్. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘ఎవరు ఏ సమస్యతో పోరాడుతున్నారో తెలీదు. అందుకే అందరిపై దయ చూపించండి’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
కాగా కొద్దిరోజుల క్రితం సమంత మయోసైటిస్ అనే అరుధైన వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. దాదాపు ఎనిమిది నెలలుగా సామ్ ఆ వ్యాధితో పోరాడుతోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ తిరిగి తన కెరీర్, సినిమాలపై ఫోకస్ పెడుతోంది. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది.