IND Vs AUS : ఢిల్లీ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు శుక్రవారం ప్రారంభంకానుంది. ఇప్పటికే తొలి టెస్టులో విజయం సాధించి ఊపుమీద ఉన్న భారత్ అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. ఈ టెస్టులో భారత్ జట్టులో ఒక మార్పు చేసే అవకాశం ఉంది. నాగ్ పూర్ లో టెస్టు అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్ కు రెండో టెస్టులో చోటు దక్కడం కష్టంగానే ఉంది. ఫుల్ ఫిట్ నెస్ సాధిస్తే శ్రేయస్ అయ్యర్ ను తుది జట్టులోకి తీసుకోవాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. తొలి టెస్టులో విఫలమైనా కేఎల్ రాహుల్ కు మరో ఛాన్స్ ఇవ్వాలని యోచిస్తున్నారు. దీంతో శుభ్ గిల్ మరోసారి బెంచ్ కే పరిమితం కానున్నాడు.
ఇక ఈ మ్యాచ్ ద్వారా పూజరా వందో టెస్టు ఆడబోతున్నాడు. అలాగే జడేజా 250 వికెట్లు సాధించడానికి అడుగు దూరంలో ఉన్నాడు. స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ జట్టులో ఉంటారు. పేసర్లుగా షమీ, సిరాజ్ కు చోటు దక్కుతుంది. తొలి టెస్టులో విఫలమైన పూజారా, కోహ్లీ నుంచి అభిమానులు భారీ ఇన్సింగ్స్ ఆశిస్తున్నారు.
తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన ఆస్ట్రేలియా సిరీస్ లో తిరిగి పుంజుకోవాలన్న పట్టుదలతో ఉంది. తొలిటెస్టులో విఫలమైన బ్యాటర్ మాట్ రెన్షాను తప్పించే అవకాశం ఉంది. గాయం కారణంగా తొలిటెస్టుకు దూరమైన గ్రీన్ తుది జట్టులోకి రావడం ఖాయం. ఇక పేసర్ స్టార్క్ కూడా ఫిటెనెస్ సాధించడం ఆస్ట్రేలియాకు అదనపుబలం. దీంతో పేసర్ స్కాట్ బోల్యాండ్ ను తప్పిస్తారు. మొత్తంమీద రెండు మార్పులతో ఆస్ట్రేలియా బరిలోకి దిగే అవకాశం ఉంది. తన తొలి మ్యాచ్ లోనే అద్భుతంగా బౌలింగ్ చేసిన స్పిన్నర్ టాడ్ మర్ఫీపైనే ఆస్ట్రేలియా భారీగా ఆశలు పెట్టుకుంది. అలాగే సీనియర్ స్పిన్నర్ నాథన్ లైయన్ తొలి మ్యాచ్ లో భారత్ బ్యాటర్లపై ప్రభావం చూపించలేకపోవడం ఆ జట్టును ఆందోళన కలిగిస్తుంది. ఢిల్లీ పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో ఆసీస్ కంగారుపడుతోంది. మొత్తంమీద ఆత్మవిశ్వాసంతో భారత్ బరిలోకి దిగుతుంటే.. ఆస్ట్రేలియా గట్టిపోటీ ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది.