Revanth Reddy: మిషన్ 90. ఇది బీజేపీ టార్గెట్. ఆపరేషన్ 100. ఇది కాంగ్రెస్ టార్గెట్. గ్రామాల్లో ఉనికి లేని బీజేపీనే 90 సీట్లపై కన్నేస్తే.. ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా బలంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఇంకెన్ని సీట్లు రావాలి? ఇదే ధీమాతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆపరేషన్ 100 స్టార్ట్ చేశారు. నెంబర్ తగ్గేదేలే అంటున్నారు. 40 సీట్లే వస్తాయంటూ ఇటీవల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన డ్యామేజీని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చేది కాంగ్రెస్.. గెలిచేది కాంగ్రెస్సే అంటూ కేడర్ లో నూతనోత్సాహం నింపుతున్నారు. పాదయాత్రలో రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రసంగాలు కార్యకర్తలను ఉర్రూతలు ఊగిస్తున్నాయి. స్థబ్దుగా ఉన్న హస్తం సేనను కదనరంగానికి సన్నద్ధం చేస్తున్నారు.
కొత్త ఏడాది కొత్త ప్రభుత్వం. రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్న మాట. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కొత్త ఏడాది మొదలవుతుంది. అంటూ రొటీన్ స్టేట్ మెంట్స్ కు భిన్నంగా రేవంత్ ప్రసంగాలు ఉంటున్నాయి. రాష్ట్రమంతా కాంగ్రెస్ హవా ఉందనే ఇండికేషన్ ఇస్తూ.. ఏకంగా 100 స్థానాల్లో హస్తం పార్టీ గెలవబోతోందంటూ మెసేజ్ ఇస్తున్నారు. వందా.. అని నోరెళ్లబెట్టే వారికి.. అవును వందే అంటూ గట్టిగా, కాన్ఫిడెన్స్ గా ఆన్సర్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. నెంబర్ గేమ్ లో ఏమాత్రం తగ్గేదేలే అంటున్నారు.
బీఆర్ఎస్ పై రేవంత్ చేస్తున్న విమర్శలు కూడా ఆలోచింపజేసేలా ఉంటున్నాయి. ఏ నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో.. అవే ఉద్యోగాల కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందంటూ యువతలో ఉద్రేకం రగిలిస్తున్నారు. రాష్ట్రం తెచ్చినోళ్లకు రెండుసార్లు అవకాశం ఇచ్చారని, రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్కు ఒకసారి అవకాశమివ్వాలని కోరుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని చెబుతున్నారు.
ఇక, హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో రేవంత్ రెడ్డి ఇస్తున్న హామీలు మామూలుగా లేవు. అవి వింటుంటే.. వేస్తే కాంగ్రెస్ కే ఓటు వేయాలని అనిపించేలా ఉంటున్నాయి. మేనిఫెస్టోలో పొందుపరిచే హామీలను ముందే పాదయాత్రలో ప్రకటించేస్తున్నారు. రేవంత్ ఇస్తున్న ఒక్కో హామీ.. బీఆర్ఎస్, బీజేపీ లకు నిద్రలేకుండా చేస్తున్నాయి.
రేవంత్ ఇస్తున్న హామీల్లో మచ్చుకు కొన్ని…
–రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం
–రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం
–ఆడబిడ్డలకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ను అందిస్తాం
–ఇందిరమ్మ పథకంలో ఇళ్లు కట్టుకునే వారికి నేరుగా రూ.5 లక్షలు ఇస్తాం
–ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతాం
–బోధన రుసుము బకాయిలను చెల్లిస్తాం